Begin typing your search above and press return to search.

బీజేపీకి ఝలక్ : మోడీ సర్కార్ మీద పోరాటమే...?

By:  Tupaki Desk   |   26 Jun 2022 12:30 PM GMT
బీజేపీకి ఝలక్ : మోడీ సర్కార్ మీద పోరాటమే...?
X
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ చాణక్యం సమయం చూసి బయటపెడుతున్నారు. అందుకే ఆయన బుర్రే బుర్ర అని అందరూ అనేది. దేశంలో ఇపుడు రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. అటు ఎన్డీయే అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఉన్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్ హా ఉన్నారు. దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ కూడా రెండుగా చీలి తమ మద్దతు అటో ఇటో తెలుపుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో చూస్తే కేసీయార్ విపక్ష శిబిరం వైపు నిలిచారు. ఏపీలో జగన్ చూస్తే బీజేపీ పక్షాన నిలబడ్డారు.

మరి చంద్రబాబు ఎవరు వైపు అన్న ఆలోచన అయితే అందరిలో ఉంది. ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో టీడీపీకి ఉన్న ఓట్ల శాతం. జీరో పాయింట్ అరవై శాతం మాత్రమే. నిజం చెప్పాలీ అంటే ఇది చాలా స్వల్పమైన నంబర్. కానీ ఇక్కడ నంబర్ ముఖ్యం కాదు తెలుగు నాట ఒక లబ్దప్రతిష్టమైన పార్టీగా ఒకనాడు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం స్టాండ్ ఏంటో చెప్పే సందర్భం.

సహజంగా అందరూ టీడీపీ కూడా బీజేపీకే మద్దతు ప్రకటిస్తుందని అనుకున్నారు. కానీ ఇంతవరకూ ఆ పార్టీ నేతలు పెదవి విప్పలేదు. ఇది పూర్తిగా బాబు మార్క్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఇక గత ఎనిమిదేళ్ళుగా టీడీపీ వైసీపీ పోటీలు పడి మరీ కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. అవి సాగు చట్టాలు అయినా మరోటి అయినా కూడా రెండవ మాట లేకుండా జగన్ చంద్రబాబు ఇద్దరూ జై మోడీ అనేస్తున్నారు.

ఇపుడు కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఏం చేస్తుంది అన్నది అంతా ఆసక్తిని ప్రదర్శిస్తున్న వేళ తూచ్ అనేసేలా చంద్రబాబు ఉన్నారని టాక్ నడుస్తోంది. దానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి. గత మూడేళ్ళుగా బీజేపీతో పొత్తు కోసం టీడీపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలీ అంటే చంద్రబాబు మోడీని ఒక్క మాట అనలేదు. పైగా మోడీ షాల పుట్టిన రోజులను గుర్తుంచుకుని మరీ విష్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికి అనేక‌సార్లు వారిద్దరినీ ఢిల్లీకి వెళ్ళి కలవాలని చూశారు, అయినా అపాయింట్మెంట్లు అయితే అసలు దక్కలేదు దాంతో బాబులో అంతకంతకు అసహనం పెరిగిపోతోంది అని అంటున్నారు. దీంతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో తమను ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదు అన్న బాధ ఉంది. ఇవన్నీ వెరసి తటస్థంగా ఉండాలన్న బోల్డ్ డెసిషన్ ఒకటి తీసుకోవాలని టీడీపీ నిర్ణయించింది అంటున్నారు.

అదే కనుక జరిగితే అటు ఎన్డీయేకు కానీ ఇటు విపక్ష శిబిరానికి కానీ టీడీపీ సమ దూరం పాటించినట్లుగా లెక్క. అదే సమయంలో మరో రెండేళ్ళలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం విషయంలో అన్ని ఆప్షన్లూ తమ వద్దనే ఉంచుకునేందుకు కూడా టీడీపీ న్యూట్రల్ స్టాండ్ ఎంచుకుంటోంది అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో జగన్ని ఫుల్ గా టార్గెట్ చేయడానికే ఈ డెసిషన్ అంటున్నారు.

ఏపీకి ఏమీ చేయకపోయినా ప్రత్యేక హోదా సహా విభజన హామీలు అన్నీ తుంగలోకి తొక్కినా బీజేపీకి జగన్ భేషరతుగా మద్దతు ప్రకటించడం మీద ఇప్పటికే జనాలలో విపరీతమైన అసంతృప్తి ఉంది. దాన్ని పూర్తిగా తాము సొమ్ము చేసుకోవడానికి జగన్ని బోనులో నిలబెట్టి నిలదీయడానికి ఈ న్యూట్రల్ స్టాండ్ ని ఎంచుకుంది అంటున్నారు.

అదే టైమ్ లో తాము ఏదో పొత్తుల కోసం పాకులాడుతున్నట్లుగా ఫీల్ అవుతున్న బీజేపీకి గట్టి ఝలక్ ఇస్తే వారి అసలు రంగు ఏంటో తెలుస్తుంది అన్న ఆలోచనలు కూడా ఉన్నాయట. అప్పటికీ కమలం నుంచి ఏ రియాక్షన్ లేకపోతే సరైన సమయం చూసుకుని ఇక మోడీ సర్కార్ మీద కూడా విమర్శలతో చెలరేగిపోవడానికి బాబు చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి రాష్ట్రపతి ఎన్నికలను చంద్రబాబు చక్కగానే ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. ఈ డెసిషన్ కనుక అమలు చేస్తే ముందుగా కార్నర్ అయ్యేది జగన్ అనే అంటున్నారు.