Begin typing your search above and press return to search.

నందమూరి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు?

By:  Tupaki Desk   |   17 Feb 2020 5:30 AM GMT
నందమూరి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరు?
X
సినీ రంగ ప్రముఖుడు.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర కాస్తలో మోసానికి గురి కాకుండా బయటపడ్డారు. తాజాగా ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి ఉదంతం బయటకు వచ్చింది. బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండటం.. రూల్స్ ను పక్కాగా ఫాలో కావటం తో ఆమె మోసానికి గురి కాకుండా బయటపడ్డారు. వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసింది ఇటీవలే బ్యాంకులో కొత్తగా చేరిన ఉద్యోగి కావటం విశేషం. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో ఏం జరిగిందంటే..

నందమూరి వసుంధరకు బంజారాహిల్స్ లోని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఇదిలా ఉంటే ఈ నెల 13న బ్యాంకు మేనేజర్లు ఫణీంద్ర.. శ్రీనివాస్ లు వసుంధర ప్రతినిధి సుబ్బారావుకు ఫోన్ చేసి.. వసుంధర మేడమ్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం అప్లై చేశారు.. యాక్టివేట్ చేయాలా? అని అడిగారు. తనకు తెలిసి అలాంటిదేమీ లేదని చెప్పిన ఆయన చెప్పి.. వసుంధరను కనుక్కొని చెబుతానన్నారు.

బ్యాంకు అధికారులు తెలిపిన విషయాన్ని వసుంధరకు చెబితే.. తాను ఎలాంటి మొబైల్ బ్యాంకింగ్ కోసం అప్లికేషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. దీంతో.. ఆ సమాచారాన్ని బ్యాంకు అధికారులకు తెలిపారు. దీంతో.. మోసం జరిగినట్లు గా గుర్తించారు. వెంటనే.. వసుంధర పేరుతో ఉన్న అప్లికేషన్ ఎవరు ఇచ్చారన్న ఉదంతంపై విచారణ జరిపారు. ఇటీవల బ్యాంకులో ఉద్యోగాన్ని పొందిన ఉద్యోగి ఒకరు ఈ మోసానికి తెర తీశారన్న విషయాన్ని గుర్తించారు. వసుంధర అసలు అప్లికేషనే పెట్టుకోలేదన్న వైనాన్ని తేల్చారు. ఈ మోసం పై పోలీసులకు సమాచారం ఇవ్వటం తో కేసు నమోదు చేసి.. బ్యాంకు ఉద్యోగి శివ పై కేసు నమోదు చేశారు. బ్యాంకు అధికారుల అప్రమత్త తో నందమూరి వసుంధర మోసానికి గురి కాకుండా బయటపడ్డారని చెప్పాలి.