Begin typing your search above and press return to search.

మూడో స్థానం ఎవరికి వచ్చినా ముప్పే!

By:  Tupaki Desk   |   13 Aug 2022 12:30 PM GMT
మూడో స్థానం ఎవరికి వచ్చినా ముప్పే!
X
తెలంగాణ రాష్ట్రంతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఆసక్తికర చర్చ ఇప్పుడురాజకీయ పార్టీల్లో నడుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యవసరంగా మారింది. ఎవరికి వారికి వారికున్న కారణాలతో మునుగోడులో తమ సత్తా చాటాలన్నది తప్పనిసరి అయ్యింది. ఈ విషయంలో ఏ మాత్రం లెక్క తేడా వచ్చినా.. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నది చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో గెలుపుకు అందరూ ప్రయత్నిస్తున్నారు సరే. ఎవరూకూడా మూడో స్థానంలో ఉండేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. అవసరమైతే ఓడినా ఫర్లేదు కానీ మూడో స్థానంలో మాత్రం నిలవకూడదన్న పట్టుదలతో ఉన్నారు. దీని కోసం పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. దీంతో.. మునుగోడు ఉప ఎన్నిక ఉండే కొద్దీ మరింత టైట్ గా సాగుతుందన్న మాట వినిపిస్తోంది.

అధికార టీఆర్ఎస్ విషయానికే వస్తే.. విజయం సాధిస్తే సరే. లేకుంటే రెండో స్థానంలో నిలవాలని తపిస్తోంది. కానీ.. పెద్ద సారు డిసైడ్ చేసినట్లుగా చెబుతున్న కూసుగుంట్ల అభ్యర్థిత్వాన్ని మునుగోడు టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. ఆయన్నే అభ్యర్థిగా ఫైనల్ చేస్తే మాత్రం ఎదురుదెబ్బ ఖాయమంటున్నారు. అభ్యర్థి మీద ఉన్న కోపంతో కింది స్థాయి నేతలు సరిగా పని చేయకుంటే.. మూడో స్థానానికి పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

అదే జరిగితే.. టీఆర్ఎస్ కు జరిగే నష్టం అంతా ఇంతా కాదన్నది ఇప్పుడు చర్చగా మారింది.కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడు పెద్ద పరీక్షగా మారింది. క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గంలో.. సొంత సీటును పోగొట్టుకుంటే జరిగే నష్టం రేవంత్ కు తెలియంది కాదు. కానీ.. ప్రతికూల పరిస్థితులు ఆయన్ను ఇబ్బందికి గురి చేసే వేళలో.. గెలుపు తేడా కొట్టినా.. రెండో స్థానంలో లేకుంటే జరిగే నష్టం మీద ఆయనకు అవగాహన ఉంది. ఈ కారణంతో మునుగోడు ఉప ఎన్నికను ఇటీవల కాలంలో ఎప్పుడు తీసుకోనంత సీరియస్ గా తీసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయానని.. తమకు తిరుగులేదన్న పరిస్థితులు ఉన్నట్లుగా గడిచిన కొంతకాలంగా బీజేపీ చెబుతోంది. దీనికి తోడు పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్న నేపథ్యంలో గెలుపు తప్పించి మరోఆలోచన లేదంటున్నారు. అయితే.. గెలుపు చెప్పినంత సులువుగా కాదన్న విషయాన్ని కమలనాథులు సైతం ప్రైవేటు సంభాషణల్లో ఒప్పుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం భారీగా ఉంటుందంటున్నారు.

అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నిక గెలుపు తప్పించి మరోదారి లేదని చెబుతున్నారు.. ఒకవేళ తేడా వచ్చి దెబ్బ పడితే కనీసం రెండో స్థానంలో ఉండాలే తప్పించి.. ఎట్టి పరిస్థితుల్లో మూడో స్థానంలో మాత్రం ఉండకూడదని కోరుకుంటున్నారు. మూడో స్థానంలో నిలిస్తే.. ఇప్పుడున్న జోష్ ఒక్కదెబ్బకు మాయమవుతుందన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన పార్టీకి ముప్పు ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.