Begin typing your search above and press return to search.

ఇంత జరిగిన తర్వాత తెలంగాణలో మున్సిపోల్స్ అవసరమా?

By:  Tupaki Desk   |   21 April 2021 4:30 AM GMT
ఇంత జరిగిన తర్వాత తెలంగాణలో మున్సిపోల్స్ అవసరమా?
X
ఒకటి తర్వాత ఒకటిగా వస్తున్న ఎన్నికల పరంపరలో.. షెడ్యూల్ అయిన ప్రకారం తాజాగా తెలంగాణలో మున్సిపోల్స్ హడావుడి నడుస్తోంది. స్థానిక ఎన్నికల్లో హడావుడి ఎంతలా ఉంటుంది? ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఓపక్క కరోనా సెకండ్ వేవ్ తీవ్రమై.. వైరస్ విరుచుకుపడుతున్న వేళ.. అనుకున్న షెడ్యూల్ ప్రకారం మున్సిపోల్స్ ను నిర్వహించాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. తాజాగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో నిన్నటి( మంగళవారం) నుంచి మే ఒకటి వరకు రాత్రి కర్ఫ్యూను విధించటం తెలిసిందే.

షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈ నెల 30న మున్సిపోల్ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మున్సిపోల్స్ ను వాయిదా వేయటమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నిర్వహించిన బహిరంగ సభ కారణంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కావటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మున్సిపోల్స్ జరుగుతాయా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే పలువురు మున్సిపోల్స్ ను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోమని కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం.. ఎన్నికల సంఘమే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు ఎన్నిక సంఘం రాష్ట్ర అధికారి తాజాగా కరోనా పాజిటివ్ కు గురైన వేళ.. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఎన్నికలకు సంబంధించి ఏం చేద్దామని ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని సలహా అడిగింది. తన నిర్ణయాన్ని ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం తెలియజేయనుంది. కరోనా నిబంధనల్ని పాటిస్తూ.. ఎన్నికల్ని నిర్వహించాలని నిర్ణయిస్తే షెడ్యూల్ లో మార్పులు ఉండవు. రేపటికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసి.. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెలువరిస్తారు. దీంతో.. ప్రచారం మొదలవుతుంది.

అయితే.. కరోనా నేపథ్యంలో పరిమితులు విధిస్తూ.. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రచారానికి పరిమితులు పెడతారని చెబుతున్నారు. అంతేకాదు.. సభలు.. సమావేశాల విషయంలోనూ కొన్ని పరిమితులు విధిస్తారని అంటున్నారు. ఏం చేసినా.. కరోనా వేళ.. ఎన్నికల పేరుతో ఉండే హడావుడిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే మంచిదని చెబుతున్నారు. లేదంటే.. మున్సిపోల్స్ పుణ్యమా అని మరికొన్ని కేసులు పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.