Begin typing your search above and press return to search.

విమానాశ్రయాల్లో రచ్చ రచ్చే ..!

By:  Tupaki Desk   |   25 May 2020 12:10 PM GMT
విమానాశ్రయాల్లో రచ్చ రచ్చే ..!
X
లాక్ డౌన్ నుండి ఇచ్చిన సడలింపులు నేపథ్యంలో .. దాదాపు రెండు నెలల తర్వాత పలు దేశీయ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దీనితో పెద్ద ఎత్తున ఎయిర్ ‌పోర్ట్ ‌లకు చేరకున్న ప్రయాణికుల్లో కొందరికి నిరాశ మిగులుతుంది. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టుగా కేంద్రం ప్రకటించిగానే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎయిర్ ‌పోర్ట్‌ లకు క్యూ కట్టారు.

అయితే ముందుగా ప్రకటించిన పలు సర్వీసులు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఎయిర్ ‌పోర్ట్‌ లలోనే నిరీక్షిస్తున్నారు. చాలా ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు కావడంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ తో సహా దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. దీనితో ఎయిర్ పోర్టుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎయిర్ లైన్స్ నుంచి తమకు ఎలాంటి సమాచారమూ అందలేదంటూ ప్యాసింజర్లు సిబ్బందితో వాదులాటకు దిగారు. చివరి క్షణం వరకు మాకు విమానాల క్యాన్సిల్ గురించి ఎందుకు తెలియజేయలేదని వారు ప్రశ్నించారు.

ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 80 సర్వీసులను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్‌ నుంచి ముంబై, ఛండీగఢ్‌, విశాఖపట్నం, తిరుపతి, నాందేడ్‌, బెంగళూరు, కడప, పుణె, త్రివేండ్రం, గోవా, కోయంబత్తూరులకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. కాగా, పలు రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మాత్రమే విమాన సర్వీసులకు అనుమతించడం, 14 రోజులపాటు క్వారంటైన్‌ కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం దీనికి కారణంగా తెలుస్తోంది. పలు రాష్ట్రాల విమానాశ్రయాలలో ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది.