Begin typing your search above and press return to search.

పెను దుమారంగా ముఫ్తీ వ్యాఖ్యలు.. ఎంతటి దారుణ వ్యాఖ్యలు చేశారంటే?

By:  Tupaki Desk   |   25 Oct 2020 4:00 AM GMT
పెను దుమారంగా ముఫ్తీ వ్యాఖ్యలు.. ఎంతటి దారుణ వ్యాఖ్యలు చేశారంటే?
X
ఈ దేశంలో ఉంటూ.. తమను తాము ప్రత్యేకంగా భావించే గుప్పెడు మంది కోసం ఈ దేశం.. దేశ ప్రజలు చెల్లించిన మూల్యం వేలాది కోట్ల రూపాయిలు. మనసులు గాయపడకూడదన్న కారణంగా ఆచితూచి వ్యవహరించిన పాపానికి..ఈ రోజు అది కాస్తా ఎంత తీవ్రరూపం దాల్చిందన్నది జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.. పీడీఎఫ్ అధినేత్రి మెహబూబా ముప్తీ నోటి నుంచి వచ్చాయి. ఒకప్పుడు మోడీ సర్కారుకు మిత్రురాలిగా వ్యవహరించటమే కాదు.. బీజేపీ-పీడీఎఫ్ ఉమ్మడి ప్రభుత్వానికి ఆమె నాయకత్వం వహించటం తెలిసిందే.

ఆర్టికల్ 370పై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె.. పద్నాలుగు నెలల పాటు హౌస్ అరెస్టులో ఉండి.. ఈ మధ్యనే బయటకు వచ్చాయి. తాజాగా ఆమె నిర్వహించిన మీడియా సమావేశంలో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వివాదాల తేనెతుట్టెను కదిపారు. కశ్మీర్ లో ప్రత్యేక జెండా ఎగురవేసే అనుమతి వచ్చే వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి.

‘ఆర్టికల్ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్ముకశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్యపోరాటంతో సాధించుకుంటాం. అప్పటివరకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయను’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జమ్ముకశ్మీర్.. లడ్డాఖ్ ప్రాంతాల్లో ఆమె పార్టీ బలం కశ్మీర్ ప్రాంతంలో మాత్రమే. అక్కడి మూడు ప్రాంతాల్లోని ప్రజల్లో కశ్మీరీ ప్రజలు తప్పించి.. మిగిలిన రెండు ప్రాంతాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున ఈ తరహా వ్యాఖ్యలకు వ్యతిరేకం. ఆ మాటకు వస్తే.. మెహబూబాకు బలం ఉన్న కశ్మీర్ లోని చాలామంది ఆమె మాటల్ని తప్పు పడతారు. కాకుంటే.. ‘కశ్మీరీ’ మాట పేరుతో ఆమె చేసే వ్యాఖ్యల్ని సూటిగా ఖండించే ప్రయత్నం మాత్రం చేయరు.

ఇదిలా ఉంటే.. ముఫ్తీ వ్యాఖ్యలపై కశ్మీరీ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను తక్షణమే దేశ ద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ‘ఈ భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ను పునరుద్ధరించటం.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక జెండాను ఎగరవేయటం లాంటివి చేయలేవు. మన జెండా.. దేశం.. మాతృభూమి కోసం ఎందరో రక్తం చిందించారు. భారత్ లో జమ్ముకశ్మీర్ అంతర్బాగం. కనుక ఇక్కడ ఒకే జెండా ఎగురుతుంది. అది కూడా త్రివర్ణ పతాకం మాత్రమే’ అని రాష్ట్ర బీజేపీ నేత రవీంద రైనా వ్యాఖ్యానించారు.

కశ్మీర్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ముఫ్తీ వ్యాఖ్యలు ఉన్నాయని.. ఏదైనా తప్పు జరిగితే ఆమె తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కశ్మీరీ నాయకులు భారత దేశం సురక్షితం కాదని భావిస్తే వారు పాకిస్తాన్.. చైనాలకు వెళ్లొచ్చన్నారు. మొహబూబా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ సైతం తీవ్రంగా ఖండించింది. త్రివర్ణ పతాకాం భారతీయుల ఐక్యత.. సమగ్రత.. త్యాగాల్ని చాటుతుందని.. దాన్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు. మొత్తంగా ముఫ్తీ మాటలు మంటలు పుట్టిస్తున్నాయని చెప్పక తప్పదు. మరి..ఈ తరహా వ్యాఖ్యలపై మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.