Begin typing your search above and press return to search.

ముద్రగడ ప్లస్ పవన్... సూపర్ కాంబో... ?

By:  Tupaki Desk   |   13 Jan 2022 2:30 PM GMT
ముద్రగడ ప్లస్ పవన్... సూపర్ కాంబో... ?
X
ఏపీలో రాజకీయాల మీద చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ళకు పైగా వ్యవధి ఉంది. అయినా వచ్చే ఎన్నికల మీద ఇప్పటి నుంచే రకరకాలైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఏపీలో రెండు పార్టీలు, రెండే కులాలదేనా ఎపుడూ అధికారం అన్న చర్చ ఈ మధ్య జోరుగా సాగుతోంది. నిజానికి ఇది ఇప్పటిమాట కాదు, మూడు దశాబ్దాల నుంచి ఏపీలో రాజకీయ సామాజిక కధ అలాగే ఉంది.

అయితే రెడ్డి, లేకపోతే కమ్మ వారే ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారు. మూడవ పార్టీకి చోటు ఉండదా, మరో సామాజికవర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కదా అన్న వేదన రోదనా గట్టిగానే ప్రతీసారీ వినిపిస్తోంది. విభజన జరిగాక ఏపీలో బలమైన కాపు సామాజికవర్గం చాలా కీలకంగా మారింది అనే చెప్పాలి. కోస్తాతో పాటు ఏపీలో దాదాపుగా ఎనభై నియోజకవర్గాల్లో వారి పాత్ర ఉంది. గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో కాపులు ఉన్నారు.

మరి ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు మాత్రమే. ఆ నంబర్ కి దరిదాపుల్లో ఉన్న కాపులకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు దక్కడంలేదు అన్నదే పెద్ద ప్రశ్న. నిజానికి కాపుల్లో ఐక్యత లేదు అన్న విమర్శ కూడా ఉంది. వారు ప్రతీ ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీని అట్టేపెట్టుకుని మద్దతుదారులుగా మారిపోతున్నారు తప్ప అధికారం కోసం గట్టిగా ప్రయత్నం చేయడం లేదు అన్నదీ ఉంది.

దీని మీద ఇటీవలే ముద్రగడ పద్మనాభం తన ఆవేదన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఎపుడూ మనం బోయీలుగానే ఉండాలా, తక్కువ జనాభాకే అధికారం దక్కాలా అని ఆయన అందులో పేర్కొన్నారు. ఏపీలో కాపులు, బీసీ, దళితులకు అధికారం దక్కాలని కూడా ఆయన కోరుకున్నారు. ఆ దిశగా తన ప్రయత్నాలు కొనసాగిస్తాను అని ముద్రగడ కచ్చితంగా చెబుతున్నారు. ఈ మేరకు చర్చలు కూడా సాగుతున్నాయి.

సరిగ్గా ఈ సమయంలోనే ఏపీలో కొత్తగా పొలిటికల్ ఆల్టర్నేషన్ రావాలని కోరే అందరికీ ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. రాష్ట్రంలో మూడవ పార్టీగా జనసేన ఉంది. దానికి సినీ గ్లామర్ పుష్కలంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారధిగా ఉన్నారు. ఆయనకు ఏపీ వ్యాప్తంగా కులాలతో సంబంధం లేకుండా ఇమేజ్ ఉంది. ఇక కాపులకు ఆరాధ్యుడిగా ముద్రగడ ఉన్నారు. మిగిలిన సామాజిక వర్గాల నుంచి కూడా ప్రముఖులంతా కలసి బహుజన ఫ్రంట్ గా ఏర్పడితే దానికి ముద్రగడ, పవన్ కళ్యాణ్ సారధ్యం వహిస్తే కచ్చితంగా ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని అంటున్నారు.

పవన్ ఇమేజ్, ముద్రగడ వ్యూహాలు, బీసీలు, దళితుల మద్దతు కలిస్తే తప్పకుండా అధికారం మూడవ పక్షానికి దక్కి తీరుతుంది అని కూడా చెబుతున్నారు. పవన్ అయితే ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుల విషయంలో ఆలోచిస్తాను అంటూనే తన పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి సారించారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పొత్తుల పేరిట మద్దతు ఇవ్వకుండా ముద్రగడ సహా బీసీలు, దళితులతో ఏర్పాటయ్యే ఫ్రంట్ తో చేతులు కలపాలని సూచనలు వస్తున్నాయి. ఈ విషయంలో కనుక ఇద్దరూ కలసి వస్తే ఏపీలో ప్రధన పక్షాలు అయినా వైసీపీ, టీడీపీలకు చుక్కలు కనిపించడం ఖాయమే అంతా అంటున్నారు. మరి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయా. చూడాలి మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి ఈ కలయిక కల కాదు అనే అంటున్నారు అంతా.