Begin typing your search above and press return to search.

ఈ పాడు కాలంలోనే అమ్మ ప్రేమకు మించింది లేదు

By:  Tupaki Desk   |   1 March 2021 12:30 AM GMT
ఈ పాడు కాలంలోనే అమ్మ ప్రేమకు మించింది లేదు
X
బంధాలు.. అనుబంధాల్లోకి మాయదారి స్వార్థం చొచ్చుకొచ్చేసి.. కాలాన్ని కలుషితం అయ్యేలా చేశాయి. దీంతో.. ఇంతకాలం వినని పాడు విషయాల్ని వార్తలుగా వస్తూ షాక్ తినేలా చేస్తున్నాయి. భర్తను చంపే భార్య.. తల్లిని చంపే కొడుకు.. బిడ్డను పొట్టనపెట్టుకునే తల్లి ఇలాంటివి. ఈ వార్తలు మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వచ్చేస్తున్నాయి. ఇలాంటివి సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తాయని.. మనసుల్ని కలుషితం అయ్యేలా చేస్తాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అయితే.. మంచి.. చెడులను రెండింటి గురించి తెలుసుకోవటం మంచిది. మన చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవటానికి వీలవుతుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. మంచి గురించి పెద్దగా రాని వార్తలు.. చెడు గురించి.. సంచలనాలు మాత్రమే పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి. ఇలాంటివేళ.. అమ్మప్రేమలోని స్వచ్ఛతను చాటి చెప్పే ఒక విషాద ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. నిస్వార్థమైన ప్రేమల్లో అమ్మప్రేమకు మించింది లేదని చెబుతారు. ఓవైపు తన ప్రాణాలు పోతున్నా.. కన్నబిడ్డ బతికి ఉండాలన్న ఆ అమ్మ ఆశ నిజం కాగా.. ఆమె మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలానికిక చెందిన 23ఏళ్ల కోటేశ్వరి.. తన ఏడాది వయసున్న బాబును తీసుకొని బంధువు అంకమరావుతో కలిసి బైక్ మీద ఒక ప్రార్థనాలయానికి వెళ్లారు. మార్గమధ్యలో అద్దంకి - నార్కట్ పల్లి రహదారిని దాటటానికి అంకమరావు ప్రయత్నించాడు. అనుకోని రీతిలో బ్యాలెన్స్ తప్పిన కోటేశ్వరి తన ఏడాది బాబుతో బండి మీద నుంచి కింద పడిపోయింది.

తిరిగి లేస్తున్న వేళ.. మృత్యువు రూపంలో మీదకొస్తున్న లారీ కనిపించింది. క్షణంలో వెయ్యో వంతు వేగంగా తన ఏడాది బిడ్డను దూరంగా విసిరేసింది. అంతలోనే వేగంగా దూసుకొస్తున్న లారీ ఆమె మీద నుంచి ఎక్కి వెళ్లింది. దీంతో.. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆమె కోరుకున్నట్లే బిడ్డ క్షేమంగా ఉండగా.. కొడుకును బతికించుకునే క్రమంలో అమ్మ అసువులు బాసింది. అమ్మప్రేమకు ఇంతకు మించిన ఉదంతం ఇంకేం ఉంటుంది చెప్పండి.