Begin typing your search above and press return to search.

ముందస్తు ఎన్నికలపై జగన్, చంద్రబాబులకు మోడీ చెప్పింది ఇదేనా?

By:  Tupaki Desk   |   6 Dec 2022 8:30 AM GMT
ముందస్తు ఎన్నికలపై జగన్, చంద్రబాబులకు మోడీ చెప్పింది ఇదేనా?
X
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన జీ20 సన్నాహక సమావేశాల అఖిలపక్ష భేటీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తం 30కి పార్టీ అధినేతలను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో భాగంగా జగన్, చంద్రబాబులకు సైతం ఆహ్వానాలు వెళ్లాయి.

ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబు వేర్వేరుగా డిల్లీకి వెళ్లి అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొద్ది క్షణాలపాటు ప్రధాని మోడీతో జగన్, చంద్రబాబు వేర్వేరుగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ముందస్తు ఎన్నికలు ఉండబోవని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

ఏపీలో గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు జనసేన, టీడీపీ ముందస్తు ఎన్నికలు వస్తాయని నమ్ముతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమ పార్టీ శ్రేణులను ఆ రెండు పార్టీలు అప్రమత్తం చేస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాయి.

వాస్తవానికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమైతే 2024 ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పైన పెరుగుతున్న వ్యతిరేకత, అంతకంతకూ పెరిగిపోతున్న రాష్ట్ర అప్పులు, ప్రతిపక్షాలు బలపడతుండటం తదితర కారణాలతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందులో భాగంగానే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ఇంటి ఇంటికీ ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్‌చార్జులను సీఎం జగన్‌ పంపుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి మరోమారు గెలిపించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఎన్నికల నాటికి మరిన్ని కొత్త పథకాలను జగన్‌ చేపడతారని అంటున్నారు.

మరోవైపు టీడీపీ.. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఓవైపు చంద్రబాబు, మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్‌ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సైతం కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి పేరుతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటì ంచారు. బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోడీ ముందస్తు ఎన్నికలు ఉండబోవని తేల్చిచెప్పినట్టు సమాచారం. ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నా.. దానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కేంద్రం అనుమతి లేకుండా ఎన్నికల కమిషన్‌ ఆ పని చేయదు. వైఎస్‌ జగన్‌ ఆశిస్తున్నట్టు అసెంబ్లీని రద్దు చేశాక రెండు మూడు నెలల్లోనే ఎన్నికలు పెట్టకపోవచ్చు. తనకు ఇష్టమొచ్చినప్పుడు పెట్టే హక్కు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది.

ఒకవేళ ఏపీ అసెంబ్లీని రద్దు చేయాలనుకుంటే జగన్‌ ముందుగా కేంద్రాన్ని అంటే ప్రధాని మోడీని ఒప్పించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందుకు వెళ్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా చెబితే అలాగే ఎన్నికల కమిషన్‌ నడుచుకునే అవకాశం ఉంటుంది.

మరోవైపు ఏపీలో జనసేన–బీజేపీ కూటమి మైత్రి ఉంది. ఈ రెండు పార్టీలు కలసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రధాని మోడీ ఇటీవల ఏపీకి వచ్చినప్పుడు సూచించారు. ఈ మేరకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అయిన ప్రధాని మోడీ ఆయనకు సైతం ఇదే విషయాన్ని సూచించినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ, జనసేన సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రెండు పార్టీలు కలసికట్టుగా బలపడి అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ ఆకాంక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్‌ ఆశిస్తున్నట్టు ముందస్తు ఎన్నికలకు మోడీ ఒప్పుకోలేదని అంటున్నారు. ఢిల్లీలో తాజాగా జగన్, చంద్రబాబులతో వేర్వేరుగా ముచ్చటించిన ప్రధాని మోడీ ముందస్తు ఎన్నికల విషయంలోనూ స్పష్టత ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పారని అంటున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగాల్సిన పరిస్థితులు లేవని ప్రధాని అన్నట్టు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.