Begin typing your search above and press return to search.

`ఆక్సిజ‌న్‌` లెక్క‌ల‌కు.. వాస్త‌వాల‌కు పొంత‌నేది మోడీజీ!.. వెక్కిరిస్తున్న వాస్తవాలు!

By:  Tupaki Desk   |   9 May 2021 4:30 PM GMT
`ఆక్సిజ‌న్‌` లెక్క‌ల‌కు.. వాస్త‌వాల‌కు పొంత‌నేది మోడీజీ!.. వెక్కిరిస్తున్న వాస్తవాలు!
X
దేశంలో క‌రోనా తీవ్ర‌స్థాయిలో ప్ర‌బ‌లిపోయింది. ఆసుప‌త్రులు చాలడం లేదు. అప్ప‌టిక‌ప్పుడు ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలు కూడా నిండిపోతున్నాయి. ఆటోలు, కార్ల‌లో వ‌చ్చే రోగులు.. వైద్య స‌దుపాయాలు అంద‌క‌.. వాటిలోనే ప్రాణాలు విడుస్తున్న ప‌రిస్థితి క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది. ఇక‌, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా నిరంత‌రాయంగా జ‌రుగుతూనే ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డా స‌రిపోవ‌డం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆక్సిజ‌న్ కోసం.. ప‌రుగులు పెడుతున్న ప‌రిస్థితి కూడా వాస్త‌వ‌మే. అయితే.. కేంద్రం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు అంతా బాగానే ఉంద‌నే లెక్క‌ల‌ను వ‌ల్లెవేస్తోంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ కూడా అయిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌.. దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై కొన్ని గ‌ణాం కాలు వెలువ‌రించారు. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 5.43 శాతానికే ఆక్సిజన్‌ అవసరమని మంత్రి చెప్పారు. అదేస‌మ‌యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా 15.62 లక్షల మంది ఆక్సిజన్‌ బెడ్‌లపై ఉన్నారని వెల్లడించారు. ఆయన చెప్పిన ఆక్సిజన్‌ లెక్క ప్రకారం చూసినా.. దేశవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా యాక్టివ్‌ కేసులు ఉండి ఉండాలి! కానీ, ఇప్పుడు యాక్టివ్‌ కేసులు కేవలం 37 లక్షలు మాత్రమే! తద్వారా, దేశంలో కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారని వివిధ వర్గాలు చేస్తున్న వాదనకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి.

సగటున ప్రతి రెండు యాక్టివ్‌ కేసుల్లో.. ఒక కొవిడ్ బాధితుడు ఆక్సిజన్‌ సపోర్టుతో మృత్యువుతో పోరాడుతు న్నాడు. ఇది నమ్మదగ్గ విషయమేనా అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కడా 1:2 పద్ధతిలో ఆక్సిజన్‌ బెడ్ల ఆక్యుపెన్సీ రేటు లేదు. అయితే.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో వర్చువల్‌గా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఆయన ఏం చెప్పారంటే... ‘‘దేశంలో శనివారం సాయంత్రానికి 1,70,841 మంది వెంటిలేటర్లపై.. మరో 4,88,861 మంది ఐసీయూల్లో.. ఇంకో 9,02,291 మంది ఆక్సిజన్‌ బెడ్లపై చికిత్స పొందుతున్నారు’’ అంటూ గణాంకాలను వెల్లడించారు.

ఆక్సిజన్‌ స్థాయి 94 కంటే తక్కువగా ఉండే రోగులకు ప్రాణవాయువు అందజేస్తారు. ఆక్సిజన్‌ సమస్యతో పాటు.. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ఐసీయూలో చికిత్స చేస్తారు. ఆక్సిజన్‌ పెడుతున్నా.. సొంతంగా ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్న వారికి వెంటిలేటర్‌ ద్వారా శ్వాస అందజేస్తారు. ఈ మూడు కేటగిరీల చికిత్సలో ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. అంటే.. కేంద్ర మంత్రి చెబుతున్న లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పుడు 15.62 లక్షల మంది కొవిడ్‌ రోగులు ఇప్పుడు ఆధారపడ్డారన్నమాట. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో.. మొత్తం యాక్టివ్‌ కేసులు 37 లక్షలుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి.. సగం యాక్టివ్‌ కేసులు ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్నాయని తెలుస్తోంది.

ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌.. ప్రతి 100 కేసుల్లో ఆక్సిజన్‌ బెడ్ల అవసరం ఎంత మందికి ఉంది? అనే విషయాన్ని వెల్లడించారు. ‘‘0.39శాతం మంది వెంటిలేటర్లపై, 1.34శాతం మంది ఐసీయూ బెడ్లపై చికిత్స పొందుతున్నారు. 3.7శాతం మంది ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నారు’’ అని ఆయన స్పష్టం చేశారు. అంటే.. ఆక్సిజన్‌ అవసరమున్న కొవిడ్‌ రోగుల సంఖ్య ప్రతి 100 మందిలో 5.43గా ఉండాలి. కానీ, హర్షవర్ధన్‌ వెల్లడించిన వెంటిలేటర్‌/ఐసీయూ/ఆక్సిజన్‌ బెడ్ల ఆక్యుపెన్సీ గణాంకాలు 15.62 లక్షలుగా ఉన్నాయి. ఆయన చెప్పిన పర్సంటేజీ ప్రకారం.. ఇది మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 5.43శాతం అనుకుంటే దేశంలో 3.12 కోట్ల మేర క్రియాశీల కేసులు ఉన్నట్లు లెక్క తేలుతోంది. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం.. మొత్తం క్రియాశీల కేసుల్లో 7.2శాతం మందికే ఆక్సిజన్‌ సపోర్టు అవసరం. ఈ లెక్కన గణించినా 2.17 కోట్ల కేసులు ఉన్నట్లే.

భారత్‌లో కేసులు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాయని ప్రపంచ దేశాలు, మీడియా గగ్గోలు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అసలు లెక్కలను దాచిపెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్రాలు అందజేసే డేటానే కేంద్రం వెల్లడిస్తుంది. రాష్ట్రాలు కూడా కరోనా కేసుల సంఖ్యను దాచిపెట్టినా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారి వివరాలను దాచలేదు. ‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసులను తక్కువగా చూపిస్తోంది’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పదేపదే విమర్శిస్తున్న విషయం తెలిసిందే..! రాష్ట్రాలు ఇచ్చే గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆక్సిజన్‌ బెడ్లపై 15.62 లక్షల మంది ఉన్నారనే నిజాన్ని వెల్లడించింది. దీంతో.. కరోనా లెక్కల్లో వాస్తవాలేంటో తేటతెల్లమైంది.

కేవలం ప్రభుత్వం కొవిడ్‌ను నియంత్రణలో పెట్టిందని చాటుకునేందుకే.. కేసుల లెక్కలను తక్కువ చేసి చూపుతున్నారని విదేశీ మీడియా గగ్గోలు పెడుతోంది. తాజాగా కేంద్రం వెల్లడించిన గణాంకాలు.. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ఇవన్నీ ఒక లెక్కయితే.. ఆస్పత్రుల్లో చేరకుండానే పోతున్న ప్రాణాలు కొవిడ్‌ మరణాల్లో జమకావడం లేదనే విమర్శలు వ‌స్తున్నాయి.ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. దేశంలో ఏమీ సీరియ‌స్‌నెస్ లేద‌ని.. అంతా బాగానే ఉంద‌ని.. మేం బాగానే చేస్తున్నామ‌ని చెప్పుకొనేందుకు మోడీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.