Begin typing your search above and press return to search.

తగ్గింది కాస్తా పెరిగింది.. ప్రపంచంలోనూ మోడీనే నెంబరు 1

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:44 AM GMT
తగ్గింది కాస్తా పెరిగింది.. ప్రపంచంలోనూ మోడీనే నెంబరు 1
X
పోగొట్టుకున్నది తిరిగి రాబట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఇందులోనూ మోడీ తన టాలెంట్ చూపించారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 13 మంది ప్రభావవంతమైన అధినేతల జాబితా సిద్ధం చేయగా.. అందులో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించటం విశేషం. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాల్ని తాజాగా వెల్లడించింది.

సర్వే చేసిన 13 మంది ప్రముఖుల్లో మోడీనే ది బెస్టుగా నిలవటమే కాదు.. మిగిలిన వారి కంటే అత్యధిక శాతంతో మోడీ నెంబరు వన్ గా నిలిచారు. ఆయనకు.. రెండో స్థానంలో మరో దేశ ప్రధానికి మధ్య ప్రజాదరణలో 6 శాతం తేడా ఉండటం గమనార్హం. అయితే.. ఇదే సంస్థ 2020 మేలో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా 84 శాతం ప్రజాదరణతో తొలిస్థానంలో నిలిచారు. గత ఏడాది మేలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆయన పరపతి 63 శాతానికి పడిపోయింది. ఇది జరిగిన ఎనిమిది నెలల్లోనే ఆయన తన పరపతిని తిరిగి సాధించటం విశేషంగా చెప్పాలి.

ప్రస్తుతం జరిపిన సర్వేలో ఆయన ప్రజాదరణ 71 శాతం మంది సానుకూలంగా ఓటేయటం విశేషం. తగ్గిన ప్రజాదరణను తిరిగి సొంతం చేసుకునే మేజిక్ ను ఆయన ప్రదర్శించారు. ఇక.. సర్వే ఫలితాల్ని చూస్తే.. మన మోడీ మొదటి స్థానంలో నిలిచారు. ఆయనకు 71 శాతం ప్రజాదరణ లభిస్తే.. రెండో స్థానంలో మెక్సికో ప్రధాని లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 60 శాతంతో మూడో స్థానంలో.. జపాన్ ప్రధాని కిషిదా 48 స్థానంలో నాలుగో స్థానంలో.. జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కాల్జ్ 44 శాతంతో ఐదో స్థానంలో నిలిచారు.

ప్రపంచానికి పెద్దన్నగా అభివర్ణించే అమెరికా అధ్యక్షుడు 43 శాతం ప్రజాదరణలో ఆరో స్థానంలో నిలిచారు. ఏడోస్థానంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఎనిమిదో స్థానంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ లు సొంతం చేసుకున్నారు. బ్రిటన్ ప్రధానికి పాస్ మార్కులు కూడా లభించలేదు. ఆయన కేవలం 26 శాతం ప్రజాదరణతో జాబితాలో చివరలో నిలిచారు. ఇంతకూ.. ఈ రేటింగ్స్ ను ఎప్పుడెప్పుడు చేపట్టారన్న విషయానికి వెళితే.. జనవరి 13-19 మధ్య వారం రోజులు ప్రతి దేశంలోనూ సేకరించిన అభిప్రాయాల్ని తాజాగా మార్నింగ్ కన్సల్ట్ తాజా రేటింగ్స్ విడుదల చేశాయి. కీలకమైన ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ నివేదిక విడుదల కావటం మోడీ మాష్టారికి మంచి శకునంగా చెప్పొచ్చు. మరి.. ఐదు రాష్ట్రాల ప్రజల ఓటు ఎలా వేస్తారో చూడాలి.