Begin typing your search above and press return to search.

అడిగేటోడు సిగ్గుపడాలి కానీ.. మోడీ సర్కారు మైండసెట్ మాత్రం మారదు!

By:  Tupaki Desk   |   26 July 2021 11:52 AM GMT
అడిగేటోడు సిగ్గుపడాలి కానీ.. మోడీ సర్కారు మైండసెట్ మాత్రం మారదు!
X
మా తాతలు నేతలు తాగారు.. మా మూతులు వాసన చూడండి అన్నట్లు ఉంటుందా ఆంధ్రోళ్ల వ్యవహారం. గతం గురించి గొప్పలు చెప్పుకోవటమే కానీ.. వర్తమానంలో ఏం పీకలేమన్నట్లుగా వారి మాటలు ఉంటున్నాయి. ఒకప్పుడు దేశ గతిని మార్చటంలోనూ కీలక భూమిక పోషించిన ఆంధ్రోళ్లు.. ఈ రోజున సిగ్గు విడిచి పదే పదే అడిగినా పట్టించుకోని దైన్య స్థితికి చేరిన దుస్థితి. దేశంలో మరే రాష్ట్రం కూడా ఇంత దారుణ పరాభవాల్ని ఎదుర్కొన్న దాఖలాలు ఇటీవల కాలంలో కనిపించదు. స్వయంగా దేశ ప్రధాని రాజ్యసభలో తనకు తానే ప్రత్యేక హోదా గురించి విస్పష్ట ప్రకటన చేసిన తర్వాత కూడా అమలు కాకుండా పోవటం.. అలా జరిగినా ఆ పార్టీ నేతల్ని నిలదీయకుండా వారికి పూలదండలు వేసి సత్కరించటం.. ఆంధ్రోళ్లకు మాత్రమే చెల్లుతుంది.

మంచితనానికి ఒక హద్దు ఉంటుంది. మంచితనం చేతగానితనంగా మారితే ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆంధ్రోళ్ల వైపు చూపిస్తున్నారన్న ఎటకారం ఈ మధ్యన కొందరి నోట వినిపిస్తోంది. న్యాయమైన హోదా డిమాండ్ ను పనికిమాలిన డిమాండ్ గా మార్చటమే కాదు.. ఎన్నిసార్లు అడుగుతారు సిగ్గులేకుండా? అడుక్కోవటానికైనా ఒక హద్దు పొద్దు ఉంటుంది. కాదని మేం ఛీదరిస్తున్నా.. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు. మా చేతిలో అధికారం ఉంది. మేం చెప్పిందే చట్టం.. చేసిందే శాసనం. అప్పటి ప్రధాని మాట ఇవ్వొచ్చు.. ఇప్పుడు ఆ కుర్చీలో ఉన్న మేం ఆ మాటను గుర్తించటం లేదు. మూసుకొని కూర్చోండన్నట్లుగా మాటల్లోనూ.. చేతల్లోనూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నా.. కిమ్మనకుండా కూర్చోవటం ఆంధ్రోళ్లకు కాక మరెవరికి సాధ్యమవుతుంది.

న్యాయమైన హక్కుల సాధన కోసం గళం విప్పేందుకు ఏ రాష్ట్ర ముందు వెనుకా చూడదరు. వెన్ను అసలే చూపరు. కానీ.. దరిద్రం ఏమంటే.. ఆంధ్రోళ్లకు మాత్రం ఆ రెండూ టన్నుల లెక్కన కనిపిస్తాయి. బలవంతుడితో పెట్టుకోవటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ.. బలహీనుడితో పెట్టుకోవటానికి పదే పదే ఇష్టపడతారు. ఎందుకంటే తమ బలప్రదర్శనకు అంతకు మించిన అవకాశం ఏముంది? బలహీనుడ్ని దారుణంగా కొట్టేస్తున్న వేళ.. ఇతర బలవంతుల్లో సైతం భయం పుట్టేస్తుంది. ఏపీ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు ఇదే తీరులో వ్యవహరిస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

విభజన తర్వాత 42 ఎంపీల స్థాయి నుంచి 25కు తగ్గిపోవటం.. జాతీయ స్థాయిలో రాష్ట్రం ఎలాంటి రాజకీయ అధిక్యతను ప్రదర్శించే పరిస్థితి లేకపోవటం.. దీనికి తోడు ప్రజల్లో లోపించిన స్ఫూర్తి.. నాయకుల్లో కనిపించని పోరాటతత్త్వం.. వెరసి.. ఆంధ్రోళ్లకు అదే పనిగా ఛీదరించుకోవటం.. ఛీత్కారాలు ఎదురుుకావటం.. వారి డిమాండ్లను పిచ్చ లైట్ తీసుకోవటం ఎక్కువైందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

తాజాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో మరో ఆలోచన లేదన్న విషయాన్ని కేంద్రం తాజాగా తేల్చేసింది. లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏ రీతిలో అమ్ముతారని ప్రశ్నిస్తున్నా.. పట్టించుకోకుండా మా ఇష్టం.. మాకు తోచింది చేస్తామన్నట్లుగా ఉన్న మోడీ సర్కారు తీరుపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నా.. అదేమీ మోడీ సర్కారుకు సెగ తగిలే స్థాయిలో లేకపోవటంతో వారు వెనక్కి తగ్గని పరిస్థితి.

మరోవైపు.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కు సంబంధించి పార్టీలన్ని ఒకే మాట మీద నిలబడినా.. కేంద్రం మీద మాత్రం ప్రభావం చూపించలేని దుస్థితి. తాజాగా వైసీపీ ఎంపీ మాధవ్ ఒక ప్రశ్నను సంధించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ స్పందిస్తూ.. 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పునరాలోచన లేదు' అంటూ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. చెప్పిన సమాధాన్నే మళ్లీ మళ్లీ చెప్పించుకోవటంలో ఏపీ నేతలకు.. ప్రజలకు కలిగే తుత్తి ఏమిటో ఎంత థింక్ చేసినా తట్టి చావదు. ఇప్పటికైనా ఈ అడగటాలు ఆపుతారా? లేక.. మళ్లీ మళ్లీ అడుగుతారా?