Begin typing your search above and press return to search.

తెలంగాణాను దెబ్బ కొడుతున్న మోడీ సర్కార్

By:  Tupaki Desk   |   13 Sep 2021 6:28 AM GMT
తెలంగాణాను దెబ్బ కొడుతున్న మోడీ సర్కార్
X
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏపినే కాదు తెలంగాణాను కూడా నరేంద్ర మోడీ సర్కార్ గట్టి దెబ్బే కొడుతోంది. రాష్ట్రాభివృద్ధికి ఎంత ఊతమిచ్చినా పార్టీ పరంగా వచ్చే ఉపయోగం లేదని బీజేపీ అగ్రనేతలు అనుకున్నారో ఏమో తెలీటంలేదు. అందుకనే అభివృద్ధిని కూడా పార్టీపరంగా, రాజకీయ కోణంలోనే నరేంద్ర మోడీ చూస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఏమిటంటే తెలంగాణాలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్ర కు తరలించేశారు.

అంతేకాకుండా మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో కోచ్ ఫ్యాక్టరీ పనులు కూడా చాలా స్పీడ్ గా మొదలు పెట్టేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణాకు అప్పటి యూపీఏ ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. ఫ్యాక్టరీని అయితే ప్రకటించింది కానీ అంగుళం పని కూడా జరగలేదు. అయితే ఆ తర్వాత 2018లో లాతూర్ లో మరో కోచ్ ఫ్యాక్టరీని రైల్వే బోర్డు మంజూరు చేసింది. విచిత్రమేమిటంటే కేంద్రం మంజూరు చేసిన తెలంగాణ లో ఫ్యాక్టరీ పనులే మొదలు కాలేదు. కానీ 2018లో రైల్వేబోర్డు మంజూరు చేసిన లాతూర్ ఫ్యాక్టరీ పనులు మాత్రం మొదలవ్వటమే కాదు చాలా స్పీడుగా జరిగిపోతోంది.

ఇదే విధంగా 2010లో సికింద్రాబాద్ లో వ్యాగన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్లు అప్పటి రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ పార్లమెంటులో ప్రకటించారు. సికింద్రాబాద్ లో అవసరమైన స్థలం లేని కారణంగా ఫ్యాక్టరీని వరంగల్ జిల్లాలోని కాజీపేటకు తరలించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అందుకు కేంద్రం అంగీకరించి వెంటనే ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే తర్వాత మొదలైన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం కారణంగా దీన్నెవరు పట్టించుకోలేదు. దాంతో కేంద్రం కూడా దీన్ని అటకెక్కించింది.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని కేంద్రం డిసైడ్ చేసింది. ఇప్పటికే మన అవసరాలకు సరిపడా బోగాలను తయారు చేయగలిగిన ఫ్యాక్టరీలు ఉన్న కారణంగా కొత్తవి మంజూరు చేసేది లేదని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది. అయినా కూడా రైల్వేబోర్డు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎలా నిర్ణయించింది ? దీనికి కేంద్రం ఎలా నిధులు మంజూరు చేసిందో ఎవరికీ అర్ధం కావటంలేదు.

అయితే తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతున్నదేమంటే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మోడి ఉద్దేశ్యపూర్వకంగానే దెబ్బ కొడుతున్నరాని. మరి తాజా పరిణామాలను కేసీయార్ ప్రభుత్వం ఎలా చూస్తుంది ? రాష్ట్ర బీజేపీ ఏమని సమాధానం చెబుతుందనేది కీలకమైంది.