Begin typing your search above and press return to search.

మోడీది ఎంత పెద్ద మనసు.. ఉచితం కోసం అంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   9 Jun 2021 5:30 AM GMT
మోడీది ఎంత పెద్ద మనసు.. ఉచితం కోసం అంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారా?
X
ఉచితమన్న మాట విన్నంతనే మనసు ఉప్పొంగుతుంది. ఉరికే వచ్చే దాని కోసం జేబులో నుంచి డబ్బులు తీయటానికి చాలామందికి ఇష్టం ఉండదు. కరోనాకు చెక్ పెట్టే టీకా వేయించుకోవటానికి డబ్బులు చెల్లించే కంటే.. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సౌకర్యాన్ని పొందేందుకు చాలామంది మక్కువ చూపిస్తారు. అందులోని ప్రధాని మోడీ మాష్టారు.. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని ఘనంగా ప్రకటించిన నేపథ్యంలో.. మరింత మంది ఆ సౌకర్యాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయటం ఖాయం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉచిత టీకా కోసం కేంద్రం పెట్టే ఖర్చు ఎంతన్న సందేహం కొందరికి వస్తోంది. దీని లెక్కలు చూస్తే.. తాజాగా మోడీ సర్కారు మాట వింటే ముచ్చమటలు పోయాల్సిందే. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా ఉచిత టీకా కోసం కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల భారాన్ని భరించేందుకు సిద్ధమవుతుందని చెబుతున్నారు. దేశంలో 18 ఏళ్లక పైబడిన వారందరికి ఉచితంగా కరోనా టీకా వేసేందుకు.. 80 కోట్ల మంది పేదలకు నవంబరు వరకు ఉచిత ఆహార ధాన్యాల్ని అందించేందుకు కేంద్రం రూ.1.45లక్షల కోట్ల భారాన్ని మోసేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

ఇందులో టీకాల మీద ఖర్చే దాదాపు రూ.50వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు నిరుపేదలకు నెలకు ఐదు కేజీల బియ్యం కానీ గోధుమలు కానీ.. ఒక కేజీ పప్పు ఇచ్చేందుకు మరో రూ.80 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. మొత్తంగా ఈ రెండింటి కోసం కేంద్రం రూ.1.45లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. మామూలు రోజుల్లోనే బాదుడుకు ప్రాధాన్యం ఇచ్చే మోడీ సర్కారు.. తాజాగా ఇస్తున్న ఉచితాల నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ తో పాటు మరెన్ని రూపాల్లో బాదేస్తుందో అన్న విషయం గుర్తుకు వస్తే చాలు.. వణుకు పుట్టక మానదు. ఇప్పటికే వచ్చే ఆదాయానికి తోడుగా.. తాజాగా అందిస్తున్న ఉచితం పేరు చెప్పి మరో బాదుడుకు తెర తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటారు. మరేం జరుగుతుందో చూడాలి.