Begin typing your search above and press return to search.

జగన్, షర్మిల వెనుక మోదీ, షా.. జగ్గారెడ్డి ఘాటు విమర్శలు..

By:  Tupaki Desk   |   26 Sep 2022 9:42 AM GMT
జగన్, షర్మిల వెనుక మోదీ, షా.. జగ్గారెడ్డి ఘాటు విమర్శలు..
X
వైఎస్సార్టీపీ అధినేత్రి రాజకీయ ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలకు నిన్నమొన్నటివరకు ఎవరూ పెద్దగా స్పందించలేదు. అదో రకం విస్మరణ అనుకుంటే.. ఇప్పుడు ఆమె విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు తగులుతున్నాయి. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి షర్మిలను ఉద్దేశించి నిలదీశారు. షర్మిలతో పాటు ఆమె అన్న, ఏపీ సీఎం వైఎస్ జగన్ వెనుక ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. అంతేకాక, జగన్, షర్మిల ఇద్దరూ బీజేపీ వదిలిన బాణాలంటూ ఆరోపించారు. మోదీ, షా చెప్పినట్ల పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగానే షర్మిలపై విమర్శలు చేశారు.

సీమాంధ్రుల ఓట్ల చీలికకు బీజేపీ పాచిక తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రుల ఓట్లను చీల్చేందుకు బీజేపీ పన్నిన వ్యూహంలో భాగంగానే జగన్, షర్మిల పనిచేస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. అక్రమంగా పెద్ద ఎత్తున ఆర్జించిన
వాళ్లు గుట్టురట్టు కాకుండా ఉండేందుకు బీజేపీ నియంత్రణలో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్, షర్మిల ఇద్దరూ బీజేపీ వదలిని బాణాలే అంటూ మండిపడ్డారు.

షర్మిల పాదయాత్ర.. నాయకులను తిట్టేందుకా? షర్మిల వైఎస్ కుమార్తె అయినంత మాత్రాన విమర్శిస్తే సహించేది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తండ్రి వైఎస్ మార్గంలో షర్మిల నడవడం లేదని ఆరోపించారు. బీజేపీని ఆమె
విమర్శించినట్లు తాను ఇంతవరకు చూడనేలేదని పేర్కొన్నారు.

ప్రధాని మోదీని షర్మిల ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అసలు షర్మిల పాదయాత్ర నాయకులను తిట్టేందుకు చేస్తున్నారా? వ్యక్తిగతంగా బురదచల్లితే ఎలా అని ప్రశ్నించారు. తమ దగ్గర సైతం ఆమెలాగా మాట్లాడేందుకు చాలా ఉంటాయని.. వైఎస్ కుమార్తె అయినంత మాత్రాన చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించారు.

వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పు సరికాదు విజయవాడలోని ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్ పేరు పెడుతూ ఏపీ సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.

మూడు రాజధానులతో ప్రగతి కలే.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిన విషయాన్ని జగ్గారెడ్డి గుర్తు చేశారు. మూడు ప్రాంతాల్లో రాజధానుల నిర్ణయం సరికాదని.. దీంతో అభివృద్ధి
సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌ది తప్పుడు నిర్ణయమని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిపై విస్తృత దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.