Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీపై దేశాధినేతల ప్రశంసల వర్షం

By:  Tupaki Desk   |   8 April 2020 5:30 PM GMT
ప్రధాని మోదీపై దేశాధినేతల ప్రశంసల వర్షం
X
కరోనా వైరస్‌ నివారణకు భారతదేశం తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయి. ముందే మేల్కొని దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో పాటు కరోనా వైరస్‌ కట్టడి.. నివారణకు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌కు ప్రజలు అత్యద్భుతంగా సహకరిస్తూ కృషి చేస్తుండడంతో ప్రపంచ దేశాల దృష్టంతా భారత్‌ వైపు పడుతున్నాయి. భారత్‌లో తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సంస్థలు కూడా హర్షిస్తున్నాయి. భారతదేశ చర్యలను గుర్తించిన బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా మోదీని హనుమంతుడితో పోల్చారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను విదేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీని మహనీయుడని కొనియాడారు. నాడు లక్ష్మణుడిని హనుమంతుడు సంజీవని ద్వారా కాపాడినట్లే నేడు మానవాళిని నరేంద్ర మోదీ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌‌ తో కాపాడుతున్నారని ప్రశంసించారు.

కరోనా వైరస్‌ నివారణకు హైడ్రాక్సి క్లోరోక్వీన్‌ అందిస్తున్నారు. ఈ మందు అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో తీవ్ర కొరత ఏర్పడింది. అయితే దీనిపై అన్ని దేశాలకు ఆ మందును అందించేందుకు భారతదేశం సిద్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించగానే ప్రపంచదేశాధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మలేరియా మందుగా పేరున్న హైడ్రాక్సి క్లోరోక్విన్‌ కరోనా నివారణకు పని చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. దీంతో ఆ మందు కోసం ప్రపంచ దేశాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌‌ ను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసే దేశం భారతే. అందుకే ప్రపంచ దేశాలన్నీ భారత్‌ ను కోరుతున్నాయి. ఈ క్రమంలో ఆ మందుపై విధించిన ఆంక్షలు ఎత్తేసి ఎగుమతులకు భారత ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

భారత్‌కు అవసరమైనంత మేర నిల్వలు ఉంచుకుని మిగతా స్టాక్‌ను అవసరమైన దేశాలకు సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించి హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ అందరికీ అందించేందుకు మోదీ మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే మోదీని ఆకాశానికి ఎత్తేశారు. మోదీ మహా నాయకుడని - మంచి వ్యక్తి అని ప్రశంసించారు.