Begin typing your search above and press return to search.

శ్రీలంకలో అందాల పోటీ.. ఎందుకంత రభస జరిగింది?

By:  Tupaki Desk   |   8 April 2021 4:30 AM GMT
శ్రీలంకలో అందాల పోటీ.. ఎందుకంత రభస జరిగింది?
X
అందాల పోటీలు ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ.. గతంలో ఎప్పుడూ జరగని అనూహ్య పరిణామాలతో తాజాగా మన పొరుగున ఉండే శ్రీలంకలో చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగిన అందాల పోటీల్లో జరిగిన రభస ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
శ్రీలంకలో మిసెస్ శ్రీలంక అందాల పోటీ నిర్వహించారు. పోటీల్లో చివరి ఘట్టమైన.. విజేతను ప్రకటించే కార్యక్రమం షురూ అయ్యింది. విజేతగా పుష్పిక డి సిల్వ పేరును ప్రకటించారు. మిసెస్ వరల్డ్ వచ్చి ఆమె తలపై కిరీటాన్ని అలంకరించారు. ఆమె పక్కనున్న రన్నరప్ లు.. మిగిలిన వారు ఆమెను అభినందిస్తున్నట్లు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

2019 మిసెస్ శ్రీలంక కిరీటం అందుకున్న కరోలిన్.. తాజాగా మిసెస్ వరల్డ్ గా ఉన్నారు. జ్యూరీ వేదికపై ఉన్న ఆమె మాట్లాడుతూ.. పోటీలో నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న మహిళకు కిరీటానని స్వీకరించే అర్హత లేదన్నారు. పెళ్లి చేసుకొని.. విడాకులు తీసుకోకూడదనే రూల్ ఉందని.. అందువల్ల తాజాగా కిరీటం మొదటి రన్నరప్ కు దక్కుతుందని చెబుతూ.. పుష్పిక తలపై ఉంచిన కిరీటాన్ని వేగంగా తీసేసి.. మొదటి రన్నరప్ తల మీద పెట్టేశారు.

అనూహ్య పరిణామాల మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామంతో అందరూ అవాక్కు అయ్యారు. అసలేం జరిగిందో కూడా విజేత పుష్పికకు అర్థమయ్యే లోపల.. ఆమె తల మీద ఉండాల్సిన కిరీటం.. మరొకరికి పెట్టేయటంతో ఆమె షాక్ తిన్నారు. కిరీటాన్ని తీసే క్రమంలో అది కాస్తా ఆమె తల వెంట్రుకల మధ్య ఇరుక్కున్నా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా బలవంతంగా లాగేసిన కరోలిన్ తీరు షాకింగ్ గా మారింది.

దీంతో.. ఏం చేయాలో తోచని పుష్పిక వేదనతో వేదిక నుంచి కిందకు దిగిపోయి వెళ్లిపోయారు. ఇదంతా జాతీయ మీడియాలో లైవ్ నడిచింది. తనకు జరిగిన అవమానంపై పుష్పిక గళం విప్పారు. తాను విడాకులు తీసుకోలేదని.. ఒకవేళ తాను విడాకులు తీసుకొని ఉంటే.. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాలని సవాల్ విసిరారు. తనకు జరిగిన అవమానానికి.. అన్యాయానికి చట్టపరంగా చర్యలు మొదలు పెట్టినట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. తన తలపై ఉంచిన కిరీటాన్ని లాగేసిన కరోలిన్ తీరును తప్పు పడుతూ.. సోషల్ మీడియాలో ఆమె ఘాటైన వ్యాఖ్య చేశారు. నిజమైన రాణి అంటే.. ఇతరుల కిరీటాన్ని దోచుకెళ్లే మహిళ కాదని విమర్శించారు. అందాల పోటీల నిర్వాహకులు కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. పుష్పిక విడాకులు తీసుకోలేదని చెప్పటంతో ఆమెకు మళ్లీ కిరీటాన్ని అందజేశారు. తాను సాధించిన విజయం దేశంలోని ఒంటరి తల్లులకు అంకితమని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మిసెస్ వరల్డ్ సంస్థ అంతర్గత విచారణను షురూ చేసింది. ఏమైనా.. అందాల పోటీ సందర్భంగా చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు షాకింగ్ గా మారటమే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.