Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే.. బ‌య‌ట‌ప‌డ‌తాం.. జ‌గ‌న్‌కు మంత్రుల సూచ‌న‌లు..!

By:  Tupaki Desk   |   16 May 2021 11:30 PM GMT
ఇలా చేస్తే.. బ‌య‌ట‌ప‌డ‌తాం.. జ‌గ‌న్‌కు మంత్రుల సూచ‌న‌లు..!
X
ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా ఉంది. క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాది కాలంగా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు దాదాపు 50శాతం ఆగిపోయాయి. అనుకున్న విధంగా అభివృద్ధి ముందుకు సాగ‌డం లేదు. మ‌రోప‌క్క‌, త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. అప్పుడే స‌గం కాలం పూర్త‌యిపోతోంది. దీంతో ప్ర‌భుత్వ వ‌ర్గాల్లోనూ.. మంత్రుల్లోనూ.. తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా.. అభివృద్ధి అనేది ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ క‌నిపించ‌డం లేదు. దీంతో మంత్రులు స‌హా ఎమ్మెల్యేలు ఆవేద‌న చెందుతున్నారు.

మ‌రోవైపు. క‌రోనా నుంచి కోలుకునేందుకు ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న‌.. యాంటీ ప్రచారం జోరుతో ప్ర‌భుత్వంపై సోష‌ల్ మీడియా వేదిక‌లుగా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా వైసీపీపై సానుభూతి ఉన్న నాయకులు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక‌, ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన‌.. సీఎం జ‌గ‌న్.. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టాల‌ని.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని... కూడా మంత్రుల‌కు, నేత‌ల‌కు పిలుపు ఇచ్చారు. అయితే.. ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యం కావ‌డంతో నేత‌లు ఎవ‌రూ ప్ర‌జ‌ల మ‌ద్యకు రావ‌డం లేదు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు మంత్రులు కొన్ని సూచ‌న‌లు చేస్తూ.. సీఎం జ‌గ‌న్‌కు ఒక సందేశం పంపారు. ప్ర‌స్తుతం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం చేసిన ప‌నుల‌ను, ఇత‌ర‌త్రా సామాజిక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బలోపేతం చేయాల‌ని.. ప్ర‌స్తుతం ఉన్న 50 మంది ఇళ్ల‌కు ఒక వ‌లంటీర్‌ను 30కి త‌గ్గించి.. మ‌రికొంద‌రిని నియ‌మించుకోవ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి మ‌రింత దూకుడుగా వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని.

మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఉపాధి కోల్పోయే యువ‌త‌కు ఇప్పుడు ఉపాధి క‌ల్పించిన‌ట్టు కూడా అవుతుంద‌ని వారు సూచిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం దీనిని సీఎం జ‌గ‌న్ కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.