Begin typing your search above and press return to search.

మటన్ మార్ట్ లపై వెనక్కి.. ప్రభుత్వాన్ని చికాకు పెట్టేలా మంత్రి మాటలు

By:  Tupaki Desk   |   13 Sep 2021 7:04 AM GMT
మటన్ మార్ట్ లపై వెనక్కి.. ప్రభుత్వాన్ని చికాకు పెట్టేలా మంత్రి మాటలు
X
అలవాటైన పని ఇట్టే చేసేయొచ్చు అనుకుంటారు అందరూ. అయితే.. కొన్ని విషయాల్లో ఇదెంత ఇబ్బందికరంగా మారుతుందో ఏపీ మంత్రిగారి మాటల్ని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు. ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు రావటం.. ఆత్మరక్షణలో పడి.. వెనకుడుగు వేయటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారుతోంది. తాజాగా మటన్ మార్టుల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఈ మధ్యనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తూ సీఎం జగన్ సొంత మీడియా సంస్థ అయిన ‘‘సాక్షి’’లో ఒక పెద్ద ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అందులో.. ప్రభుత్వం ఆలోచిస్తున్న సరికొత్త మటన్ మార్ట్ ల గురించి వివరంగా వెల్లడించారు.

మరే మీడియాలోనూ రాకుండా.. మొదట సాక్షిలో రావటంతో.. ప్రభుత్వ విధానాల గురించిన సమాచారం ప్రజలకు ముందే అందించే క్రమంలో ఇలాంటి ఆర్టికల్ వచ్చిందని భావించారు. మిగిలిన మీడియాలతో పోలిస్తే.. అధికారపార్టీకి చెందిన మీడియా సంస్థకు సమాచారం అందటం మామూలే అనుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వమే మటన్ మార్ట్ లు నిర్వహించాలన్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ప్రతిపక్షాలతో పాటు.. పలువురు ప్రభుత్వ ఆలోచనను తప్పు పట్టారు.

ఇదిలా ఉంటే.. సాక్షి పత్రికలో వచ్చిన ప్రత్యేక కథనంలో పేర్కొన్న కీలక అంశాల్ని చూస్తే.. "అందుబాటు ధ‌ర‌ల్లో ఆరోగ్య‌క‌ర‌మైన మాంసాహారాన్ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మాంసం దుకాణాలు (మ‌ట‌న్ మార్టు) ఏర్పాటుకు ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. తొలి ద‌శ‌లో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఇవి ఏర్పాటు అవుతాయి. మ‌లి ద‌శ‌లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్త‌రించేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు" అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ మటన్ మార్టులు ఏ రీతిలో ఉంటాయన్న విషయాన్ని వివరంగా వెల్లడించారు. "4 అడుగుల పొడ‌వు, 4 అడుగుల వెడ‌ల్పు, 7 అడుగుల ఎత్తు క‌లిగిన మొబైల్ మ‌ట‌న్ విక్ర‌యాల వాహ‌నాన్ని ఎక్క‌డికైనా సుల‌భంగా త‌ర‌లించేందుకు వీలుగా డిజైన్ చేశారు. 120 చ‌ద‌ర‌పు విస్తీర్ణంలో ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలో క‌నీసం 10 జీవాల‌ను వ‌ధించేందుకు వీలుగా వ‌ధ‌శాల‌తో పాటు డ్రెస్సింగ్‌, జీవాల అవ‌య‌వాల (గ్రేడ్స్‌) వారీగా క‌టింగ్‌, డ్రెస్సింగ్‌, ప్యాకేజింగ్‌, రిటైల్ విక్ర‌యాలు జ‌రిపేందుకు రూపొందించారు" అని వివరంగా రాసుకొచ్చారు.

కొందరేమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వమే మటన్ మార్ట్ లను నిర్వహిస్తే.. నాణ్యత విషయంలో ఢోకా ఉండదని పేర్కొంటే.. మరికొందరు మాత్రం ప్రభుత్వం ఏంది? మటన్ వ్యాపారం చేయటమేంది? ఇదెక్కడి గోల అంటూ తిట్టిపోయటం మొదలు పెట్టారు. ఇక.. రాజకీయ ప్రత్యర్థులు మరో రాగాన్ని బయటకు లాగారు. ప్రభుత్వం మటన్ వ్యాపారాన్ని ఆదాయం కోసం చేస్తున్నట్లుగా పేర్కొంటూ ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. మొత్తంగా వివాదంగా మారిన మటన్ మార్ట్ ల వ్యవహారంలో ఏపీ సర్కారు వెనకడుగు వేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ అంశంపై రాష్ట్ర మంత్రి అప్పలరాజు విడుదల చేసిన ప్రకటన ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేసింది. "ఆంధ్రప్రదేశ్‌లో మటన్‌ మార్ట్‌ల ఏర్పాటు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఈ విషయంలో విపక్షాలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారి ద్వారానే హైజినిక్‌ కండిషన్‌లో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన మినీ రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా నాణ్యమైన మాంసపు ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించాం" అని పేర్కొంటూనే.. ప్రతిపక్షాలు.. ఎల్లో మీడియా అనవసర రాద్దాంతం చేస్తున్నట్లుగా ఆయన పేర్కొనటాన్ని తప్పు పడుతున్నారు. ఎందుకంటే.. ఈ అంశంపై మొదట కథనం వచ్చిందే సాక్షిలో అయినప్పడు.. ఎల్లో మీడియా కారణం ఎలా అవుతుందన్నది ప్రశ్నగా మారింది. ప్రభుత్వాన్ని తప్పు పట్టేందుకు తరచూ ఎల్లో మీడియా జపం చేయటం బాగానే ఉన్నా.. అన్ని సందర్భాల్లో సూట్ కాదన్న విషయాన్ని ఇప్పటికైనా ఏపీ అధికారపక్ష నేతలు గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.