Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ లాగే రాహుల్‌ కు కౌంట‌రిచ్చిన హ‌రీశ్‌

By:  Tupaki Desk   |   15 Aug 2018 11:23 AM GMT
కేటీఆర్‌ లాగే రాహుల్‌ కు కౌంట‌రిచ్చిన హ‌రీశ్‌
X
తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ పార్టీలో వార‌స‌త్వ పోరు జ‌రుగుతుంద‌నేది సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వార‌స‌త్వ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌ కు అప్ప‌గిస్తారా? మేన‌ల్లుడు హ‌రీశ్‌ రావుకు అప్ప‌జెప్తారా? అనే చ‌ర్చ ముగింపు లేకుండా జ‌రుగుతూనే ఉంది. అదే స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రికి వారు త‌మ‌దైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్ర‌ధానంగా కేటీఆర్ క్లాస్‌ కు చేరువ అయితే హ‌రీశ్‌ రావు మాస్‌ కు ద‌గ్గ‌ర‌య్యారు. అయితే, మాస్ లీడ‌ర్ అనే పేరున్న హ‌రీశ్ రావు క్లాస్ ట‌చ్‌తో తాజాగా కౌంట‌ర్ ఇచ్చారు. అలా ఆయ‌న ఎదురుదాడి చేసింది ఎవ‌రిపై అంటే కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై. అందులోనూ కేటీఆర్ సృష్టించిన ట్రెండ్‌ ను హ‌రీశ్ రావు ఫాలో అయ్యారు.

రాహుల్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో టీఆర్ ఎస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌గా...ఆయ‌న‌ వ్యాఖ్యలపై వరుస ట్వీట్లలో మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. స్వతంత్ర భారతంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని అమలుచేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి స్వేచ్ఛను హరించిందని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులకు రాహుల్ నివాళుర్పించడంపై మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అమరవీరులకు నివాళులర్పిస్తున్న రాహుల్.. గత చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 369 మందిని కాల్చిచంపిన చరిత్ర నాటి ప్రధాని ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆలస్యం వల్ల 2009 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమంలో ఎంతో మంది ప్రాణాలను త్యాగంచేయాల్సి వచ్చిందని చెప్తూ.. ఆ ఆత్మబలిదానాలకు మీరు క్షమాపణ కోరుతారా? అని నిలదీశారు.

ఇలా కేటీఆర్ దూకుడు ప్ర‌ద‌ర్శించిన మ‌రుసటిరోజు ట్విట్టర్ వేదికగా సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు. స్క్రిప్ట్ రైటర్లతో జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌ కు హరీశ్‌ రావు సూచించారు. ``కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో అంచనా వ్యయాన్ని రూ. 38 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచారని రాహుల్‌ కు స్క్రిప్ట్ రైటర్లు చెప్పారు. మరి ప్రాణహిత - చేవెళ్ల తొలి జీవో రూ. 17 వేల కోట్లకు జారీ చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు మరిచిపోయారా?. ఏడాది వ్యవధిలోనే కనీసం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టకముందే 2008లో రూ. 38 వేల కోట్లకు - 2010లో రూ. 40 వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం ఆ విధంగా ఎందుకు పెంచారో రాహుల్ చెప్పగలరా? కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 80 వేల 190 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించింది. రూ. లక్ష కోట్లకు కాదు. ఈ విషయం రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రైటర్లకు తెలియదా? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించి.. కేవలం ఏడాది వ్యవధిలోనే అన్ని అనుమతులను ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ``మన దేశంలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి సీడబ్ల్యూసీ అనేది అపెక్స్ బాడీ.. జలవనరుల శాఖకు ఇది అనుబంధం. ఈ విషయంపై రాహుల్‌కు, ఆయన స్క్రిప్ట్ రైటర్లకు అవగాహన ఉందా? `` అని హరీశ్‌ రావు అడిగారు. అలాంటి అత్యున్నత కమిషన్ విశ్వసనీయతను రాహుల్ ఎలా అనుమానిస్తారని ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాజెక్టు పేరును తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. ఈ విషయంలో కూడా రాహుల్‌ను స్క్రిప్టు రైటర్లు తప్పుదోవ పట్టించారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అంబేడ్కర్ ప్రాణహిత ప్రాజెక్టు అలాగే ఉందని హ‌రీశ్‌ రావు తెలిపారు. కాగా, బావ‌బామ్మ‌ర్దులు ట్విట్ట‌ర్ వేదిక‌గా కొత్త పుంత‌ల్లో రాజ‌కీయాన్ని హీటెక్కిస్తున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.