Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి ఎంపీ - ఎమ్మెల్యే మధ్య ఫ్లెక్సీల రచ్చ !

By:  Tupaki Desk   |   15 Oct 2021 9:07 AM GMT
అర్ధరాత్రి ఎంపీ - ఎమ్మెల్యే మధ్య ఫ్లెక్సీల రచ్చ !
X
సద్దుల బతుకమ్మ వేడుకల సాక్షిగా మానుకోటలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ ఎంపీ కవితల మధ్య రాజకీయ వర్గ పోరు కొనసాగుతోంది. ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేందుకు ఒకరు.. నిలువరించేందుకు మరొకరు అన్నట్లుగా ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య హై వోల్టాజీ పాలిటిక్స్ రన్ అవుతున్నాయి. ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ల మధ్య నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరు, గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని పట్టణంలో ఎంపీ కవిత వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శంకర్ నాయక్ అనుచరులు చించి వేశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగింది.

విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం..శంకర్ నాయక్, ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ కవిత టీఆర్ ఎస్, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు వెంటనే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ వెంటనే డీజీపీతో కూడా మాట్లాడి అనంతరం ఆమె ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు కావాలనే తమ ఫ్లెక్సీలు తొలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు చెందిన నలుగురు అనుచరులను మానుకోట పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకట రత్నం అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ అర్థరాత్రి రెండు గంటలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన అనుచరులను విడిచి పెట్టాలని సీఐని కోరారు.

అందుకు సీఐ నిరాకరించడం గమనార్హం. చేదు అనుభవంతో ఎమ్మెల్యే ఇంటికి తిరుగు ముఖం పట్టారు. ఎమ్మెల్యే, ఎంపీల మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ఎలా ముగుస్తుందనేదానిపైనే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ లో గత కొద్ది సంవత్సరాల నుంచి ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్గీయుల మధ్య సైలెంట్ పోరు కొనసాగుతోంది. బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ కవిత వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎంపీ అనుచరులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు అయ్యింది. అంతేకాదు.. అర్ధరాత్రి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. 8 మంది పరారీలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తన వాళ్లను విడిచిపెట్టాలంటూ పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి 2 గంటల పాటు హల్ చల్ చేశారు.

సీఐ తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, అని ఒకింత ఆవేదనకు లోనయ్యారు. తన ఇంటిపై దుండగులు దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు, అని శంకర్ నాయక్ ప్రశ్నించారు. మరోవైపు.. ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని కూడా శంకర్ ఆరోపిస్తున్నారు. ఈ ఫ్లెక్సీల వివాదం నాకు తెలియదు. పార్టీ కోసం జెండాలు మోసిన కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయంపై, పోలీసులు వ్యవహారించిన తీరుపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.