Begin typing your search above and press return to search.

ఆ గేమింగ్ కంపెనీని రూ.5.15 లక్షల కోట్లకు కొనేస్తున్నారట

By:  Tupaki Desk   |   19 Jan 2022 7:39 AM GMT
ఆ గేమింగ్ కంపెనీని రూ.5.15 లక్షల కోట్లకు కొనేస్తున్నారట
X
కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడో డీల్ ఆసక్తికరంగా మారింది. ఒక గేమింగ్ కంపెనీని ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ భారీ మొత్తానికి సొంతం చేసుకోవటానికి సిద్దమైంది. అందరిని ఆకట్టుకునేలా వీడియోగేమ్ లను రూపొందించే సంస్థగా పేరున్న యాక్టివిజన్ బ్లిజార్డ్ ను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ డీల్ విలువ అక్షరాల రూ.5.15 లక్షల కోట్లుగాచెబుతున్నారు. ఇంతకీ ఈ కంపెనీ ఏమిటన్నది చూస్తే.. క్యాండీ క్రష్ అనే పాపులర్ వీడియో గేమ్ కూడా ఈ కంపెనీదే.

తాజగా బయటకు వచ్చిన ఈ డీల్ వివరాల్నిచూస్తే.. యాక్టివిజన్ కంపెనీ షేర్ ముగింపు ధరతో పోలిస్తే 45 శాతం ప్రీమియంతో ఒక్కో షేరుకు 95 డాలర్లను మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఆదాయ పరంగా చూస్తే.. ప్రపంచంలో మూడో అతి పెద్ద వీడియో గేమింగ్ కంపెనీగా యాక్టివిజన్ బ్లిజార్డ్ ను చెబుతారు. మైక్రోసాఫ్ట్ డీల్ బయటకు వచ్చిన నేపథ్యంలో.. ఆ కంపెనీషేర్ ధర భారీగా పెరిగింది.

ఇప్పటికే ఉన్న ధరకుసోమవారం ఈ షేరు 36 శాతం పెరుగుదలతో ఒక్కో షేర్ 65.39 డాలర్లకు చేరుకుంది. మంగళవారం మరింత పుంజుకొని మరో 30 శాతం పెరిగి ఒక్కో షేరు 85 డాలర్లకు చేరుకుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో దగ్గర దగ్గర 70 శాతానికి మించి ధర పెరగటం గమనార్హం. అయినప్పటికీ.. మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసిన ధరతో పోలిస్తే.. తక్కువగా ఉండట గమనార్హం.

కొవిడ్ నేపథ్యంలో వినోదానికి సంబంధించి గేమింగ్ ప్రధానంగా మారటంతో.. ఈ భారీ డీల్ కు మైక్రోసాఫ్ట్ ఆసక్తిని ప్రదర్శిస్తోంది. లాక్ డౌన్ వేళలో ఎక్కువ మంది ఇంట్లోనే ఉండటంతో వీడియో గేమ్ లను ఎక్కువగా ఆడినట్లు వైనాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెబుతున్నారు. ఈ గేమింగ్ కంపెనీని మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకున్న పక్షంలో.. ఆ సంస్థకు ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న బాబీ కోటిక్ కొనసాగుతారని చెబుతున్నారు. ఒక గేమింగ్ కంపెనీ విలువ ఇంత భారీగా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో గేమింగ్ కంపెనీల్ని ప్రముఖ కంపెనీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.