Begin typing your search above and press return to search.

ఎంత దారుణంగా హత్య చేశారంటే.. వీధికో ఒకటి చొప్పున పడేశారు

By:  Tupaki Desk   |   28 Nov 2021 5:40 AM GMT
ఎంత దారుణంగా హత్య చేశారంటే.. వీధికో ఒకటి చొప్పున పడేశారు
X
నిత్యం హత్యలు చాలానే చోటు చేసుకుంటున్నా..కొన్నింటికి సంబంధించిన వివరాలు తెలిసినంతనే షాకింగ్ గా ఉంటాయి. ఇప్పుడు చెప్పే క్రైం కూడా ఈ కోవకు చెందినదే. తాజాగా వెలుగు చేసిన ఈ దారుణ హత్య గగుర్పాటుకు గురయ్యేలా ఉంది. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో వెలుగు చూసిన ఈ హత్యోదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. మొండం లేని తల కనిపించటంతో మొదలైన వెదుకులాట.. హత్యకు గురైన వారే కాదు హత్యకు కారణమైన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..

గోదావరి ఖనిలోని ఎన్టీపీసీ ఖాజీపల్లికి చెందిన 35 ఏళ్ల కాంపల్లి శంకర్ కనిపించకుండా పోయాడు. మీ సేవ కేంద్రంలో పని చేసే ఈ ఆపరేటర్ ను అత్యంత కిరాతకంగా చంపేయటమే కాదు.. వీధికొక శరీర భాగాన్ని పడేసిన వైనం వణికించేలా ఉంది. అతడికి భార్య.. ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు ఉన్నారు. గురువారం సాయంత్రం నుంచి శంకర్ కనిపించకుండా పోయాడు.

దీంతో అతడి తల్లి పోచమ్మ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు శంకర్ తలను గుర్తించారు. ఎన్టీపీసీ ప్లాంట్ గోడ వద్ద మొండం లేని శంకర్ తల మాత్రమే కనిపించింది. దీంతో అతడి శరీర భాగాల కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. చివరకు ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు.

అతడిచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వెతగ్గా.. మిగిలిన శరీర భాగాలు ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని గుర్తించారు. తల నుంచి శరీరం కింది భాగం వరకు ఒక్కొక్క భాగాన్ని ఒక్కో వీధిలో పడేశారు. శనివారం రాత్రికి.. మిగిలిన అన్ని భాగాల్ని గుర్తించారు. ఇంతకీ ఇంత దారుణంగా హత్య జరిగిందన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. తన కుమారుడ్ని పొట్టన పెట్టుకుంది అతడి భార్యనేనని శంకర్ తల్లి ఆరోపిస్తోంది. తన కోడలు.. ఆమె బంధువులే తన కొడుకును హత్య చేశారని వాపోతోంది. ఈ విషయంపై పోలీసులు మరిన్ని వివరాల్ని సేకరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ దారుణ హత్య ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది.