Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రజా ప్రతినిధులకు రెడ్ వార్నింగ్

By:  Tupaki Desk   |   24 May 2022 3:30 PM GMT
వైసీపీ ప్రజా ప్రతినిధులకు రెడ్ వార్నింగ్
X
అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులకు రెడ్ వార్నింగ్ ఇచ్చేశారు మావోయిస్టులు. ఏజెన్సీలో వారు తిరిగితే తరిమేయండి. అసలు వారు ఈ చాయలకు రాకుండా చూడండి. ఇదే మావోల లేటెస్ట్ హాటెస్ట్ వార్నింగ్. ఆదీవాసీల ఓట్లతో గెలిచిన మీరు పెత్తందారీ విధానాలకు ఎలా మద్దతు ఇస్తారు అంటూ మావోలు ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీని అతలాకుతలం చేసే గిరిపుత్రుల వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అనుసరిస్తూంటే మౌనంగా మద్దతు ఇస్తున్నారు అంటూ మావోలు ఫైర్ అవుతున్నారు.

కొత్తగా ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ గనులు తవ్వాలన్న ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయని మావోయిస్ట్ పార్టీ ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేర్కొన్నారు. అందుకే జీవో నంబర్ 97ను రద్దు చేసినా కూడా అన్‌రాక్ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని మాత్రం రద్దు చేయలేదని గణేష్ అంటున్నారు.

ఇక వైసీపీ సర్కార్ కొత్తగా జీవో నంబర్ 89ను తెరమీదకు తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. దీని అర్ధం పరమార్ధం బాక్సైట్ గనులను పూర్తిగా కొల్లగొట్టడమే అని ఆయన అన్నారు.

అల్లూరి జిల్లాను ప్రేమతో ఏర్పాటు చేయలేదని, గిరి సిరులను బలి తీసుకోవడానికే ఏర్పాటు చేశారని ఆయన వైసీపీ సర్కార్ పెద్దల మీద నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా దోపిడీ మయం అని కూడా ఆయన విమర్శించారు. రాష్ట్రాన్ని తీవ్రమైన ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టారని, రుణాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆయన అంటున్నారు. వైసీపీ సర్కార్ ఏలుబడిలో రాజకీయ సామాజిక వివాదాలు పెద్ద ఎత్తున పెరిగాయని కూడా గణేష్ అంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని జనాలు అంతా వ్యతిరేకించాలని పిలుపు ఇచ్చారు.

మొత్తానికి మావోలు కన్నెర్ర చేశారు. ఈసారి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో అల్లూరి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏజెన్సీలో తిరగడం అంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని, పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్య‌లక్ష్మి, చెట్టి ఫల్గుణలను ఏజెన్సీ వస్తే తరిమేయాలని కోరుతూ గణేష్ తాజాగా విడుదల చేసిన లేఖతో అల్లూరి జిల్లాలోని అధికార పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి.