Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, ఇత‌ర ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు

By:  Tupaki Desk   |   2 Jun 2020 1:00 PM GMT
తెలంగాణ ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, ఇత‌ర ప్ర‌ముఖుల శుభాకాంక్ష‌లు
X
ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించిన దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాష్ట్రంగా ఏర్ప‌డి అద్భుత విజ‌యాలు సాధిస్తూ దూసుకెళ్తున్న రాష్ట్రాన్ని కీర్తించారు. అవ‌త‌ర‌ణ వేడుక‌ల సంద‌ర్భంగా ప‌లువురు సోష‌ల్ మీడియా ద్వారా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాన‌మంత్రి, ఇత‌ర కేంద్ర‌మంత్రులు, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి. మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో వేడుక‌లు లేకుండా నిరాడంబ‌రంగా ఉత్స‌వాలు నిర్వ‌హించారు.

అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ ఫోన్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు బాగున్నాయ‌ని.. ఇదే స్ఫూర్తితో దూసుకెళ్లాల‌ని ఆకాంక్షించారు.

ప్ర‌ధాన‌మంత్రి ట్వీట్‌
అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్స‌వ‌ శుభాకాంక్షలు. ట్విట‌ర్‌లో ఈ మేర‌కు ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి, శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను.. అని తెలిపారు.

ఉప రాష్ట్ర‌ప‌తి శుభాకాంక్ష‌లు
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ట్వీట‌ర్‌లో తెలిపారు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నా అని ట్వీట్ చేశారు.

అచ్చ తెలుగులో గ‌వ‌ర్న‌ర్‌
రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై సౌంద‌ర‌రాజ‌న్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అచ్చ తెలుగులో ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. మ‌న‌మంద‌రం ఐక్యంతో కృషి చేసి ఉత్త‌మ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామ‌ని, మ‌న దేశ‌మే మ‌న గౌర‌వం, మ‌న రాష్ట్రమే మ‌న గౌర‌వం అంటూ జై హింద్‌.. జై తెలంగాణ అంటూ ఓ వీడియోలో శుభాకాంక్ష‌లు తెలిపారు.

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.