Begin typing your search above and press return to search.

మోడీ భేటీ తర్వాత సోనియాపై దీదీ షాకింగ్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   25 Nov 2021 7:32 AM GMT
మోడీ భేటీ తర్వాత సోనియాపై దీదీ షాకింగ్ వ్యాఖ్యలు
X
రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. మిత్రులు అంటూ ఎవరూ ఉండరన్న విషయం తెలిసిందే. ఇక్కడ కీలకమంతా కాలానిదే. అదెప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. జాతీయస్థాయిలో తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామం కాంగ్రెస్ పార్టీకి కచ్ఛితంగా ఇబ్బందికి గురి చేసేదేన్న మాట వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఢిల్లీకి రావటం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావటం తెలిసిందే.

ఇంతవరకు బాగానే ఉన్నట్లు కనిపించినా.. దీదీ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్య ఒకటి జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామానికి తెర తీసినట్లుగా చెప్పాలి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో మరో రాజకీయ కూటమి అంటే కాంగ్రెస్ తోనే అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. మూడో కూటమి అన్న మాట కేసీఆర్ లాంటి అధినేతల నోటి నుంచి వచ్చినా అదేమీ అయ్యేది కాదన్న పెదవి విరుపు ఉంది.

మోడీ అధీనంలో ఉన్న బీజేపీకి ఎన్నికల్లో షాకివ్వాలంటే కాంగ్రెస్ తో పాటు.. బలమైన ప్రాంతీయ పార్టీలు కలిసి కట్టుగా బరిలోకి దిగితే తప్పించి.. మరోసారి బీజేపీకి అధికారం రాకుండా కట్టడి చేయలేమన్న మాట వినిపిస్తోంది. ఇలాంటిది జరగాలంటే కచ్ఛితంగా మమతా బెనర్జీ కీలక భూమిక పోషించాలి. ఎందుకంటే.. ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో.. అత్యధిక స్థానాల్ని ఖాయంగా సొంతం చేసుకునే పార్టీలతోనే మోడీ సర్కారుకు ప్రత్యామ్నాయానికి వీలుంటుంది.

అలాంటివేళ.. బలమైన ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ సంబంధాలు చక్కగా ఉండాలి. మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ కోరాలే కానీ తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన మమత.. కాంగ్రెస్ అధినేత్రి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. మోడీతో భేటీ తర్వాత యూపీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ కోరితే తాము సాయం చేస్తామన్న దీదీ.. ఈ నెల 30న రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటిస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ భేటీ అవుతానని చెప్పారు. మరి.. ఢిల్లీకి వచ్చిన మీరు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అవుతారా? అని ప్రశ్నించిన మీడియాకు మాత్రం షాకిచ్చే ఆన్సర్ ఇచ్చారు. ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి? ఆమెతో భేటీ కావాలని రాజ్యాంగమేమీ ఆదేశించలేదుగా అంటూ విరుచుకుపడం ఆసక్తికరంగా మారింది. తాజాగా దీదీ మాటలు చూస్తే.. కాంగ్రెస్ తో సంబంధం లేకుండా.. బలమైన ప్రాంతీయ పార్టీల అండతో కూటమి కట్టాలన్న యోచనలో దీదీ ఉన్నారా? అన్న భావన కలిగేలా తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.