Begin typing your search above and press return to search.

ఆర్థిక స‌మ‌స్య‌లుంటే ఆ సీఎంలా చేయాలి బాబు

By:  Tupaki Desk   |   6 July 2018 9:24 AM GMT
ఆర్థిక స‌మ‌స్య‌లుంటే ఆ సీఎంలా చేయాలి బాబు
X
పీక‌ల్లోతు ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న ఏపీకి స్వ‌స్థ‌త చేకూర్చాలంటే..అంత సింఫుల్ గా తేలిపోయే అంశం కాదు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు కాయ‌క‌ల్ప చ‌ర్య‌లు భారీగా చేయాల్సి ఉంటుంది. అయితే.. ఎప్పుడూ హంగూ ఆర్భాటంతో హ‌డావుడి చేసే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు మ‌హా చిత్రంగా ఉంటుంది.

ఓవైపు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక స‌మ‌స్య‌ల్ని ఏక‌రువుపెడుతూనే.. మ‌రోవైపు మాత్రం త‌న విలాసాల్ని.. భారీ ఖ‌ర్చుల్ని త‌గ్గించుకోని తీరు క‌నిపిస్తుంది. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి పొదుపు చేయ‌టం సాధ్య‌మేనా? అలా ఎవ‌రైనా చేస్తారా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు. అయితే.. అది సాధ్య‌మేన‌ని.. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని చూపిస్తున్నారు.

పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా దీదీ చేప‌ట్టిన చ‌ర్య‌ల్ని తాజాగా తెర‌పైకి వ‌చ్చాయి. ఆమె తీసుకునే మ‌ధ్యాహ్న భోజ‌నం నుంచి మ‌ట‌న్.. రొయ్య‌ల‌ను తొల‌గించుకున్నార‌ట‌. ఎందుకిలా అంటే.. ప్ర‌జాధ‌నాన్ని విలాస‌వంత‌మైన కార్య‌క్ర‌మాల‌కు.. ఈవెంట్ల‌కు వినియోగించ‌కుండా పొదుపు చ‌ర్య‌లు పాటించాలంటూ ఆమె అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో పాల‌నాప‌ర‌మైన ఖ‌ర్చుల్ని త‌గ్గించుకోవ‌టానికి 12 ప్ర‌భుత్వ శాఖ‌ల్ని క‌లిపి బ‌డ్జెట్‌ను కేటాయించారు. ఇందులో భాగంగా ఈవెంట్లు నిర్వ‌హించే స‌మ‌యంలో చేసే డెక‌రేష‌న్లు.. రిప్రెష్ మెంట్స్ తో పాటు.. తిండి ఖ‌ర్చులు కూడా బాగా త‌గ్గించాల‌ని ఆదేశించార‌ట‌.

అంతేకాదు.. అధికారులు వెళ్లే ఫారిన్ ట్రిప్పులు..ఢిల్లీ ట్రిప్పుల్ని బాగా త‌గ్గించాల‌ని..ఇక నుంచి ఆఫీసుల్లో క‌త్త ఏసీలు ఏర్పాటు చేయొద్ద‌న్న ఆదేశాల్ని జారీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఖ‌ర్చుకు కోత వేస్తున్న దీదీని చూసైనా చంద్ర‌బాబు త‌న తీరు మార్చుకుంటే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.