Begin typing your search above and press return to search.

దీదీకి దాదాతో చెక్..బెంగాల్ లో బీజేపీ నయా ప్లాన్!

By:  Tupaki Desk   |   16 Oct 2019 4:02 PM GMT
దీదీకి దాదాతో చెక్..బెంగాల్ లో బీజేపీ నయా ప్లాన్!
X
నిజమే... పశ్చిమ బెంగాల్ లో తనకు కొరకరాని కొయ్యగా మారిన దీదీకి చెక్ పెట్టేందుకు కమలనాథులు పన్నుతున్న వ్యూహం ఆసక్తికరంగానే ఉందని చెప్పక తప్పదు. దీదీగా పేరొందిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి - పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెక్ పెట్టేందుకు బీజేపీ అధిష్ఠానం ఏకంగా మనమంతా దాదాగా పిలుచుకుంటున్న మాజీ క్రికెటర్ - ప్రస్తుతం బీసీసీఐ చీఫ్ గా కొత్త బాధ్యతల్లోకి దిగిపోతున్న సౌరవ్ గంగూలీని రంగంలోకి దించుతోందట. దీదీని సీఎం కుర్చీ నుంచి దించేందుకు చాలా రోజుల నుంచి ప్లాన్ల మీద ప్లాన్లేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు - కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... ఇప్పుడు దాదాను రంగంలోకి దించేందుకు నయా వ్యూాహాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

ఈ కొత్త వ్యూహంలో భాగంగానే దాదాను ఇప్పటికిప్పుడు బీసీసీఐ ఛీప్ కుర్చీలో కూర్చోబెట్టేస్తున్నారు. ఈ పదవిలో దాదా 2020 దాకా ఉండనున్నారు. ఆ తర్వాత ఆ పదవి నుంచి దిగిపోగానే... పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వనున్న దాదాను ఏకంగా బీజేపీ పశ్చిమ బెంగాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కూడా అమిత్ షా రంగం సిద్ధం చేశారట. పొలిటికల్ ఎంట్రీపై దాదా ఇప్పటికే ఖండించినా కూడా అతడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు ప్రకటనలు ఎందుకన్న వ్యూహంతోనే ఈ తరహా ప్రకటనలు చేస్తున్నట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.

గడచిన రెండు - మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే... బెంగాల్ లో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా దాదా దిగిపోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పదవికి దాదా నామినేషన్ వేయగా... ఆయన వెంట స్వయంగా అమిత్ షాతో పాటుగా బీజేపీలోనే కాకుండా క్రికెట్ వ్యవహారాల్లో చాలా చురుకుగా వ్యవహరించడంతో పాటుగా ఏకంగా బీసీసీఐ చైర్మన్ గానూ వ్యవహరించిన ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనరాగ్ ఠాకూర్ కనిపించారు. వీరిద్దరి ఎంట్రీతో దాదాకు పోటీగా ఏ ఒక్కరూ నామినేషన్ వేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దాదాను బీసీసీఐ చైర్మన్ గా ఎంపిక చేసేసిన అమిత్ షా... తన కుమారుడు జై షాతో బీసీసీఐ కార్యదర్శి పోస్టు కోసం నామినేషన్ వేయించారు.

అంటే దాదాతో పాటు తన కుమారుడిని కూడా బీసీసీఐలోకి ఎంట్రీ ఇప్పించేందుకు అమిత్ షా చాలా వ్యూహాత్మకంగానే పావులు కదిపినట్లుగా సమాచారం. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా ఉన్న దాదా... ఇప్పుడు బీసీసీఐ చైర్మన్ గా పదవి చేపడితే.. 2020 తర్వాత మూడేళ్ల పాటు బీసీసీఐ పదవులకు దూరంగా ఉండక తప్పదు. బీసీసీఐ కొత్త రాజ్యాంగమే ఇందుకు కారణమని కూడా చెప్పాలి. అంటే... బీసీసీఐ చైర్మన్ గా దాదాపుగా ఎంపికైపోయిన దాదా... 2020లో ఆ పదవి నుంచి తప్పుకుని మూడేళ్ల పాటు ఖాళీగా ఉండనుండగా... 2021లో బెంగాల్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఆయనను పాలిటిక్స్ లోకి దించడంతో పాటుగా దీదీని గద్దె దింపేందుకు ఏకంగా అతడిని బెంగాల్ లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపనున్నారట. అదే జరిగితే... బెంగాల్ లో దీదీకి దెబ్బేనన్న వాదనలు కూడా కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి.