Begin typing your search above and press return to search.

పీఏలే కొంప ముంచుతున్నారా... ?

By:  Tupaki Desk   |   22 Jan 2022 6:36 AM GMT
పీఏలే  కొంప ముంచుతున్నారా... ?
X
ఈ పీఏలు ఉన్నారే. వారే ఎపుడూ పవర్ ఫుల్లు. ఒక్కోసారి వారే ఎమ్మెల్యేలుగా కూడా వ్యవహరించేస్తూంటారు. అంటే డీఫ్యాక్టో ఎమ్మెల్యేలుగా అన్న మాట. వారిని ఎంతవరకూ నమ్మాలో అంతవరకే నమ్మాలి. కానీ వారినే కళ్లుగా చెవులుగా చేసుకుని చూడకూడదు. అలా కనుక చేస్తే చాలా తేడాలు వచ్చేస్తాయి. పైగా రాజకీయమే కంప్లీట్ గా ఉల్టా సీదా అవుతుంది. చివరికి కొంప కొల్లేరు అయినా ఆశ్చర్యంలేదు.

ఇదే సీన్ ఇపుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇలాకాలో కనిపిస్తోంది అంటున్నారు. ఆమె మంచి వారే. ఆమె సొమ్యురాలే. సమర్ధురాలే. ఎవరికి ఏ పని అయినా చేసి పెట్టేవారే. కానీ ఆమెకూ జనాలకు మధ్య ఇద్దరు పీఏలు అడ్డుగా ఉన్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఆఖరుకు సీన్ ఎంతదాకా వచ్చిందంటే సొంత పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యేను కలవాలంటే ఈ పీఏలే అడ్డుగా ఉన్నారట. తాము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే దగ్గర తమకేంటి ఈ పాట్లు అని వారంతా గుస్సా అవుతున్నారు. ఇక మూడేళ్ళకు పాలన పూర్తి అవుతున్న నేపధ్యంలో పాతపట్నంలో ఎమ్మెల్యే పొలిటికల్ గ్రాఫ్ చూస్తే ఏమంతా బాగా లేదు అంటున్నారు.

ఎమ్మెల్యే మీద వ్యతిరేకత చాప కింద నీరులా పెరిగిపోతోంది. ఈ మధ్యనే జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో హీరమండలం నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే కొడుకు శ్రావణ్ టీడీపీ చేతిలో ఓడిపోయారు. జిలాలో మొత్తానికి మొత్తం జెడ్పీటీసీలు వైసీపీ పరం అయితే ఒక్కటే కోల్పోయింది. ఆ ఒక్కటే ఎమ్మెల్యే కుమారిడిది అంటే ఇంతకటే నామార్దా ఉంటుందా అనిపించకమానదు. వంశధార నిర్వాసితుల సమస్య వల్లనే ఈ ఓటమి అని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

మరి గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ ఎమ్మెల్యేలు తెలియడంలేదా అన్నదే చర్చగా ఉందిట. ఆమెకు వాటిని తెలియనివ్వకుండా పీఏలు చేస్తున్నారని, దాని వల్ల ఆమె నష్టపోతున్నారు అంటున్నారు. ఇక పాతపట్నంలో అయిదు మండలాలు ఉంటే అందులో మూడు మండలాల నుంచి గెలిచిన వైసీపీ ఎంపీపీలు కూడా ఎమ్మెల్యేను కాదని తమ పలుకుబడితోనే నెగ్గారు అంటున్నారు.

మరో వైపు పార్టీలో కూడా అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యే ఎక్కువ టైమ్ ఢిల్లీలోనే ఉంటారు, ఆమె పీఏలే రాజ్యం చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో పాతపట్నంలో వైసీపీకి ఆదరణ ఉన్నా చేజేతులా పోగొట్టుకుంటున్నారు అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక రెడ్డి శాంతి ఆషామాషీ నేత కాదు, ఆమె తాత సాయిబాబు నాయుడు, తండ్రి రాజశేఖర్‌, తల్లి రుక్మిణమ్మ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఒక విధంగా రాజకీయ కుటుంబం ఆమెది. ఇక తన తరువాత వారసుడిగా శ్రావణ్ ని తీర్చిదిద్దాలనుకుంటున్న రెడ్డి శాంతి పాతపట్నంలో ఉంటూ రాజకీయం గుప్పిట పట్టాలి. కానీ పీఏలకు అంతా అప్పగిస్తే ఎలా ఉంటుందో హీరమండలంలో పరాజయం రుచి చూపించింది.

ఇక్కడ టీడీపీ గట్టిగానే ఉంది. టీడీపీ పెట్టాక ఇప్పటికి అయిదు సార్లు ఆ పార్టీ గెలిచింది. టీడీపీకి చెందిన కలమట కుటుంబానికి పట్టు ఉంది. వైసీపీ ఆవిర్భవించాక 2014లో కలమట మోహనరావు వారసుడు వెంకటరమణ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తరువాత కాలంలో టీడీపీలోకి వెళ్ళిపోవడంతో 2019లో రెడ్డి శాంతి పోటీ చేసి గెలిచారు. మరి 2024లో ఆమె మరోసారి పోటీకి తాను గానీ తనయుడు కానీ దిగాలనుకుంటున్నారు. మరి ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే ఈ సీటు నుంచి గెలుపు అన్నది వైసీపీకి ఇబ్బంది కావచ్చు అన్న మాట అయితే సొంత పార్టీ నుంచే ఉంది మరి.