Begin typing your search above and press return to search.

రాపాక గురించేనా : జంపింగ్ ఎమ్మెల్యే ఎందుకు అయ్యారో మరి...?

By:  Tupaki Desk   |   30 Jun 2022 12:30 AM GMT
రాపాక గురించేనా : జంపింగ్ ఎమ్మెల్యే ఎందుకు అయ్యారో మరి...?
X
మెచ్చుకోవడం అంటూ మొదలుపెడితే రాజకీయ నాయకులకు తెలుగు భాషలో పదాలే అస్సలు దొరకవేమో. ఇక గిచ్చుకోవడం అంటూ స్టార్ట్ చేస్తే ఎక్కడ లేని మాటలూ కూడా అలా నోట్లో గటగటా వచ్చేస్తాయి. అందుకే పొలిటీషియన్స్ గ్రేట్ అనాల్సిందే. ఇంతకీ విషయం ఏంటి అంటే జనసేన తరఫున 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు గుర్తున్నారు కదా. ఆయనే గోదావరి జిల్లాలకు చెందిన రాజోలు ప్రజా ప్రతినిధి.

ఆయన గురించి వైసీపీకి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చాలా గొప్ప మాటలే చెప్పారు. అది కూడా వైసీపీ ప్లీనరీలో. రాజోలులోని గన్నవరం మండలంలో జరిగిన ప్లీనరీతో పొన్నాడ సతీష్ మాట్లాడుతూ రాపాక 2019లో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అని కితాబు ఇచ్చారు. రాజోలుగా జనసేన గెలుపు పవన్ కళ్యాణ్ వల్ల కానే కాదని అన్నారు.

ఆ గెలుపు పూర్తిగా రాపాకకే దక్కుతుందని చెప్పారు. ఆయన వ్యక్తిత్వం  అలాంటిది మరి అని కూడా తెగ పొగిడారు. ఇక 2024 తరువాత ఏపీలో టీడీపీ జనసేన కనుమరుగు అవుతాయని కూడా ఆయన జోస్యం చెప్పేశారు. ఈ సంగతి ఇలా ఉంటే రాపాక వ్యక్తిత్వం గొప్పదని, అందుకే గెలిచారు అని అంటున్న పొన్నాడ సతీష్ కి తెలిసినా చెప్పని విషయం ఇక్కడ మరోటి ఉంది.

అదీ అసలైన వ్యక్తిత్వాన్ని నిరూపించేది అని జనాలు అంటున్నారు. ఆ వ్యక్తిత్వం ఏంటి అంటే తానున్న పార్టీకి తాను గెలిచిన పార్టీకి విధేయంగా ఉండడం. నిజాయతీగా ఉండడం. ఎన్నికల్లో గెలిచిన వెంటనే జనసేన  కండువా తీసేసి వైసీపీకి జై కొట్టిన రాపాకకు ఇంకా వ్యక్తిత్వం ఉందని అది ఆకాశమంత ఎత్తు అని పొన్నాడ భావిస్తే ఆయనకు మాత్రమే అలా కనిపిస్తోంది అనుకోవాలేమో.

పార్టీ గుర్తుతో ఎవరైనా ఎన్నికలకు వెళ్తారు. అధినేత చరిష్మా ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఎంత సొంత ఇమేజ్ ఉన్నా మిగిలిన రెండూ కూడా ప్లస్ అయితేనే ఎవరైనా గెలుపు బాట పడతారు. అలాంటిది రాపాక గెలుపు అంతా ఆయన సొంతమని పొన్నాడ వంత పాడడం నిజంగా బాధకరమే అంటున్నారు. ఇక రాపాక ఉన్న పార్టీని, తిన్న ఇంటినీ కాదని వైసీపీ నీడను చేరడానికి ఏ రకమైన నైతికతగా చూడాలి అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా రాపాక ఉన్నతుడిగా వైసీపీకి కనిపిస్తే కనిపించవచ్చు.

మరి ఏకంగా 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ నాడు తీసుకెళ్ళినపుడు అలా చేరిన వారి వ్యక్తిత్వాన్ని కూడా ఎందుకు గుర్తించి పొగడలేదో వైసీపీ వారే చెబితే బాగుంటుందేమో. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులు అన్నవి స్పూర్తిని తూట్లు పొడుస్తాయి. జనాలు ఒకరనుకుని గెలిపిస్తే గెలిచాక మరో పంచన చేరడం వల్ల సొంత వ్యక్తిత్వం ఉందని జనాలు అయితే కచ్చితంగా భావించరు అనే అంటున్నారు. మొత్తానికి రాపాక రాజకీయంగా రాటుదేలిన నాయకుడు కావచ్చు కానీ జనసేన నుంచి కాలు జారిన  నేతగానే ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అంటున్నారు.