Begin typing your search above and press return to search.

జయను జాగ్రత్తగా చూసుకోమని ఎంజీఆరే చెప్పారు : శశికళ

By:  Tupaki Desk   |   19 July 2021 11:30 PM GMT
జయను జాగ్రత్తగా చూసుకోమని ఎంజీఆరే చెప్పారు : శశికళ
X
వీకే శశికళ .. అలియాస్ చిన్నమ్మ .. అలియాస్ జయలలిత అత్యంత సన్నిహితురాలు .. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ తన జీవితంలోని కొన్ని కీలక అంశాల్ని వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూ లోనే జయలలితను ఎలా కలిసింది, ఆ తర్వాత వారిరువురి మద్య ఏర్పడిన బంధం గురించి , ఎంజీఆర్ గురించి అలాగే డీఎంకే అధినేత , స్వర్గీయ నేత కరుణానిధి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. తన వివాహవేడుకల్లో పాల్గొన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనను ధీరవనితనంటూ మెచ్చుకున్నారని వీకే శశికళ తెలిపారు.

తమ కుటుంబం చాలా పెద్దదని, తండ్రి తోబుట్టువులు కలిపి మొత్తం 11 మంది దాకా ఉన్నారని, 46 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారని చెప్పారు. తాను డాక్టర్‌ కావాలనుకున్నానని, తమ కుటుంబీకులు అమ్మాయిలకు తక్కువ వయస్సులోనే పెళ్ళిళ్లు చేస్తారని, తనకు కూడా చిన్న వయస్సులో పెళ్ళి జరి గిందని , ఆ కారణంగానే డాక్టర్‌ కావాలనే తన కోరిక నెరవేరలేదని శశికళ వాపోయారు. నటరాజన్‌ తో జరిగిన వివాహం గురించి ప్రస్తావిస్తూ పెళ్ళి నిశ్చితార్థం తర్వాతే ఆయన డీఎంకేకు చెందినవారని తెలిసిందని చెప్పారు. 1973 సెప్టెంబర్‌ 16న తంజావూరులోని కాంతై తమిళ్‌సంఘం హాలులో తమ వివాహం జరిగిందని, ఆ వేడుకకు వచ్చిన కరుణానిధి.. పెళ్ళికూతురు తలెత్తుకుని ఠీవీగా కూర్చుందే అంటూ అందరినీ నవ్విం చారని గుర్తు చేసుకున్నారు.

ఆ వివాహ వేదికపై కరుణానిధి ప్రసంగిస్తూ వధువు ధీరవనితలా ఉందని, మహిళలందరూ ఇలాగే వుండాలని ప్రశంసించారని తెలిపారు. 1981 డిసెంబర్‌లో ప్రపంచ తమిళ మహానాడులో జయలలిత పాల్గొన్న కార్యక్రమాలకు తన పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ జరిగిందని, ఆ వీడియోలు చూసి ఆమె మెచ్చుకున్నారని శశికళ తెలిపారు. ఆ తర్వాత కన్ని యాకుమారిలో జయ చేసిన ప్రసంగం వివాదాస్పదం కావడంతో ఆ సభ కార్యక్రమాలను తీసిన వీడియో కోసం డీఎంకే నేతలు తీవ్రంగా ప్రయత్నించారని, కానీ తాను ఆ వీడియోను పార్టీ ప్రముఖుడి ద్వారా జయకు చేర్చానన్నారు. ఆ సంఘటన తర్వాతే జయ నుంచి పిలుపు అందింది అని తెలిపారు.

ఆ తర్వాత ఓ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆమెను కలుసుకున్నానని, ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు రాసిన లేఖలను చదువుతున్నారని చెప్పారు. అప్పటి నుంచి తమిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయని చెప్పారు. మొదటి నుంచి తాను జయను అక్కా అనే పిలుస్తున్నానని తెలిపారు. జయ నగరంలోని పలు ప్రాంతాలను ఒంట రిగా సందర్శించేందుకు ఆశపడ్డారని, ఆ మేరకు తామిద్దరం కలసి ఓ రోజు ఉదయం కారులో తిరువాన్మియూరు దాటి ఈస్ట్‌ కోస్‌ రోడ్డు వరకు వెళ్ళామని, కారును రోడ్డు పక్కనే నిలబెట్టి ఇరువురం పెద్ద చేతి రుమాళ్లను కట్టుకుని రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు వాకింగ్‌ చేశామన్నారు.

తన గురించి జయే ఎంజీఆర్‌ కు తెలిపారని, ఆయనోసారి తనను కలిసి జయను జాగ్రతగా చూసుకోండి అంటూ చెప్పారని శశికళ తెలిపారు. ఎంజీఆర్‌ మృతి చెందిన రోజే తాను జయను పోయెస్‌ గార్డెన్‌ లో కలుసుకున్నానని శశికళ తెలిపారు. ఎంజీఆర్‌ చనిపోయిన విషయాన్ని జయకు ఎవరూ చెప్పలేదని, తానే ఫోన్‌ చేసి చెప్పగానే దిగ్భ్రాంతి చెందారని, ఆ రోజంతా విరక్తిగా గడిపారని తెలిపారు. జయ, తాను కారులో ఎంజీఆర్‌ భౌతికకాయం ఉంచిన రామావరం గార్డెన్‌ కు వెళ్ళినప్పుడు ఎవరూ తమను లోపలకు అనుమతించలేదని, గేటును మూసివేశారని చెప్పారు. ఆ సమయంలో జయ ఆ గేటును పగులగొట్టుకుని వెళ్లాలని డ్రైవర్‌ ను ఆదేశించారని, తమ కారు వేగంగా రివర్స్‌ వెళ్ళటం గమనించి సిబ్బంది గేటును తెరిచారని వెల్లడించారు . ఆ సమయంలో అక్కడ మాజీ మంత్రి రాజారామ్‌ తోపాటు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా వున్నారని, తమను చూడగానే వారిని లోపలకు అనుమతించండి అంటూ రజనీ చెప్పారని తెలిపారు. రజనీని చూడటం అదే మొదటిసారి అని శశికళ చెప్పారు.