ఇన్ఫ్రా రంగంలో తెలుగు రాష్ట్రాల్లో నెం1 స్థాయికి చేరుకుని - దేశంలోని అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పుడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం - ట్రాన్స్ మిషన్ లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డు సొంతం చేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన లింక్-1లోని మూడు పంపింగ్ స్టేషన్లకు అవసరమైన విద్యుత్ సరఫరా చేసే నాలుగు సబ్ స్టేషన్లు - వాటి లైన్లను సకాలంలో పూర్తి చేసి తన నైపుణ్య ప్రతిభను చాటుకుంది. ప్రైవేటు రంగంలో దేశంలోనే అతిపెద్దదైన తొలి ట్రాన్స్ మిషన్ వ్యవస్థను ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని కదిరి వద్ద భారీ సబ్ స్టేషన్ ను గడువుకన్నా ముందే పూర్తి చేసి పవర్ గ్రిడ్ నుంచి పురస్కారం అందుకుని జాతీయ స్థాయిలో మన్ననలు పొందిన మేఘా తాజాగా కాళేశ్వరం లింక్-1లో భారీ విద్యుత్ వ్యవస్థను సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్ట్ లింక్-1 కింద 3 పంప్ హౌస్ ల నుంచి 28 పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయటానికి 1120 మెగా వాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ప్రపంచంలో ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ ను వినియోగించే ఎత్తిపోతల పథకాలు ఇంతవరకు ఎక్కడా నిర్మించలేదు.
ఇప్పటి వరకు ప్రపంచంలో ఈజిప్ట్ లోని ముబారక్ పంపింగ్ స్టేషన్ మాత్రమే అతి పెద్దది. ఈ ఎత్తిపోతల పథకానికి 288 మెగావాట్ల విద్యుత్ వినియోగించే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏడేళ్ళ కాలం పట్టింది. కానీ మేఘా ఇంజనీరింగ్ చేపట్టిన కాళేశ్వరం లింక్-1 విద్యుత్ వ్యవస్థ దానికన్నా దాదాపు నాలుగు రెట్లు పెద్దది కాగా ఏడాది సమయంలోనే పూర్తి చేసి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని చాటుకుంది.
లింక్-1లోని మేడిగడ్డ - అన్నారం - సుందిళ్ల - రామడుగు (ప్యాకేజీ-8) 4 సబ్ స్టేషన్లతో పాటు ట్రాన్స్ మిషన్ లైన్లను నిర్ణీత గడువు ఏడాదిన్నరలోగా పూర్తి చేసింది. రామడుగు (ప్యాకేజ్-8) సబ్ స్టేషన్ 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి 2018 మే 6న గ్రిడ్ కు అనుసంధానం చేసింది. సుందిళ్ల సబ్ స్టేషన్ ను 2017 జులై 30న పనులు ప్రారంభించి 2018 జులై 18తేది లోగా పూర్తిచేసింది. ఏడాదికి ముందే ఈ సబ్ స్టేషన్ పూర్తయ్యింది. అన్నారం సబ్ స్టేషన్ పనులు 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి 2018 సెప్టెంబర్ 14న వినియోగంలోకి తెచ్చి గ్రిడ్ కు అనుసంధానం చేసింది. మేడిగడ్డ సబ్ స్టేషన్ 2017 ఏప్రిల్ ప్రారంభం కాగా 2018 సెప్టెంబర్ 29న ఛార్జ్ చేసి గ్రిడ్ కు అనుసంధానం చేసింది. మొత్తం లింక్-1లో వీటి పనులు పూర్తికావడం వల్ల జైపూర్ (అదిలాబాద్) విద్యుత్ కేంద్రం నుంచి మేడిగడ్డ వరకు విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అయ్యే వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేయగలిగింది. 2017లో నాలుగు సబ్ స్టేషన్ ల పనులను తెలంగాణ ప్రభుత్వం మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించగా రికార్డు సమయంలో అంటే 2018 మే నెల నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి వరుసగా నాలుగు సబ్ స్టేషన్ లను మేఘా అందుబాటులోకి తెచ్చిందని మేఘా పవర్ డిపార్ట్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ శరథ్ దీక్షిత్ చెప్పారు.
రామడుగుతో మొదటి అడుగు:
ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ ను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 8లో భాగంగా మేఘా నిర్మించింది. ఈ పంప్ హౌస్ లో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 7 భారీ పంప్ మోటార్లకు విద్యుత్ ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను మేఘా ఏర్పాటు చేసింది. సబ్ స్టేషన్ తో పాటు 18 కిలోమీటర్ల మేర 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్ మిషన్ లైన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సబ్ స్టేషన్ ను కరీంనగర్ జిల్లా రామడుగులో నిర్మించింది.
ఏడాదిలోపే సుందిళ్ల:
సుందిళ్ల లింక్-1 - లింక్-2ను అనుసంధానం చేస్తుంది. రోజుకు కనీసం రెండు టిఎంసిల నీటిని పంప్ చేసే విధంగా 9 మోటర్లను (పంపులను) ఏర్పాటు చేస్తున్నారు. 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంపింగ్ స్టేషన్ లోని తొమ్మిది పంప్ మోటార్లకు విద్యుత్ను అందించేందుకు 400/220/11 కేవీ సబ్స్టేషన్ - ట్రాన్స్ మిషన్ లైన్లను మేఘా ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్ సుందిళ్ల పంపు హౌస్ పంపు మోటార్లకు విద్యుత్ ను అందించడంతోపాటు 220/11 కేవీ అన్నారం - 220/11 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ లకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీనిని పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల పంపు హౌస్ సమీపంలోని గోలివాడ గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.
అన్నారం సబ్ స్టేషన్:
480 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంపు హౌస్ లోని 12 పంపు మోటార్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ 220/11 కేవీ అన్నారం సబ్ స్టేషన్ - ట్రాన్స్ మిషన్ లైన్లను ఏర్పాటు చేశారు. 28 కిలోమీటర్ల 220 కేవీ టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్లను 400/220/11 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ నుంచి 220/11 కేవీ అన్నారం సబ్ స్టేషన్ వరకు ఏర్పాటు చేశారు. ఈ సబ్ స్టేషన్ ను పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామం వద్ద ఏర్పాటు చేశారు.