Begin typing your search above and press return to search.

చినబాబుకు కొత్త చిక్కు.. చర్యలు తప్పవా?

By:  Tupaki Desk   |   18 Jun 2020 5:00 AM GMT
చినబాబుకు కొత్త చిక్కు.. చర్యలు తప్పవా?
X
ప్రపంచమంతా మాయదారి రోగంతో వణుకుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం రాజకీయం యమా సీరియస్ గా సాగుతోంది. అధికార.. విపక్షాల మధ్య ఎత్తులు పైఎత్తులు ఒక రేంజ్లో సాగుతోంది. ఎవరికి ఏ అవకాశం చిక్కినా వదిలేది లేదన్నట్లుగా వ్యవహారం నడుస్తోంది. దీంతో.. తరచూ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల పాటు అసెంబ్లీ.. శాసనమండలిని నిర్వహించిన వైనం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న సభలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యవహరించిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆక్షేపణ తెలియజేస్తున్నారు.

మండలి జరుగుతున్న వేళ.. నారా లోకేశ్ తన సెల్ ఫోన్ తో ఫోటోలు తీసి.. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటాన్ని తప్పు పడుతున్నారు. చినబాబు వ్యవహారశైలి మండలి చరిత్రలో దుర్దినంగా అభివర్ణిస్తున్నారు. మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సభ జరుగుతున్నప్పుడు లోకేశ్ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని.. అదో పెద్ద క్రైమ్ అని పేర్కొన్నారు. లోకేశ్ చర్య సభను చులకన చేయటమేనని చెప్పారు.

సభ్యుల హక్కుల్ని లోకేశ్ కాలరాచారని.. నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. సెల్ ఫోన్ తో ఫోటోలు తీస్తున్న విషయాన్ని గుర్తించి.. అది తప్పన్న సంగతి పేర్కొంటూ ఆయన వద్దకు వెళ్లి చెప్పే ప్రయత్నం చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన టీడీపీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర.. మరికొందరు దాడి చేసినట్లుగా చెప్పారు. సభలో టీడీపీ సభ్యుల తీరు పూర్తిగా ఆక్షేపణీయమని పేర్కొన్నారు.

మండలిలో డిప్యూటీ ఛైర్మన్ తీరు బాగోలేదన్నారు. మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటల పాటు కోరినా పట్టించుకోలేదన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చిన్న అవకాశం లభించినా.. లోకేశ్ ను విడిచి పెట్టకూడదన్నట్లుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. మండలిలో లోకేశ్ ఫోటోలు తీసిన వైనాన్ని ఒక పట్టాన విడిచిపెట్టే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ మండలిలో ఫోటోలు తీయకూడదన్న విషయం లోకేశ్ కు తెలుసంటారా? అన్నది మరో క్వశ్చన్ గా మారింది.