Begin typing your search above and press return to search.

నేటి నుండి ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ ..ఎప్పటి వరకు !

By:  Tupaki Desk   |   22 April 2021 3:56 AM GMT
నేటి నుండి ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ ..ఎప్పటి వరకు !
X
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ సెకండ్ వేవ్ లోనే ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందొ. ముఖ్యంగా మన రాష్ట్రంలో మహారాష్ట్ర లో ఈ సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ పై ఉద్ధవ్‌ ఠాక్రే సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (గురువారం) నుంచి మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ ‌డౌన్‌ విధించారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి మహారాష్ట్రలో పూర్తి లాక్ ‌డౌన్‌ అమల్లో ఉంటుంది.

ఏప్రిల్‌ 22 రాత్రి నుంచి మే 1వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కట్టడికి మరో దారి లేక‌ లాక్ డౌన్ వైపు మహారాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. కరోనా కట్టడి చర్యలకు సహకరించాలని ప్రజలను ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గత వారమే లాక్‌డౌన్‌ విషయమై అన్ని పార్టీల నాయకులతో సమావేశమై చర్చించారు. అప్పుడు రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇన్నీ చర్యలు తీసుకున్నా కరోనా వైరస్‌ అదుపులోకి రాకపోవడంతో చివరకు గత్యంతరం లేక లాక్‌డౌన్‌ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం నుంచి మే 1వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. కాగా, ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా మరింత విజృంభిస్తోన్న కారణంగా 144 సెక్షన్‌ విధించిన ప్రభుత్వం.. మే 1 వరకు కర్ఫ్యూ తరహా నిబంధనలను అమలు పరుస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కోవిడ్‌ కట్టడి విధుల్లో ఉన్న పోలీసులు కూడా మరోమారు వైరస్‌ బారిన పడుతున్నారు. లాక్ డౌన్ వేళ అత్యవసర సేవలు మినహా అన్ని వర్తక, ఉద్యోగ, వాణిజ్య కార్యకలాపాలు స్థంభింప చేస్తారు. మరోవైపు, కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇలా ఉండగా, గత ఐదు రోజుల నుంచి దేశంలో నిత్యం రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటోంది.

ఓ వైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్నా కూడా దేశంలో రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మహారాష్ట్ర మాత్రమే లాక్ డౌన్ వేసింది. ఇప్పటికైనా కూడా మిగిలిన రాష్ట్రాల ప్రజలు కళ్లు తెరచి , కరోనా నియమాలు సక్రమంగా పాటించకపోతే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే రేపో మాపో మిగిలిన రాష్ట్రాలు కూడా తీసుకోకతప్పదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్స్ , నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ఈ స్టేజ్ నుండి దాటిపోయి లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా విజృంభణ జోరుగా సాగుతుంది. ఈ మద్యే సీఎం కేసీఆర్ కూడా కరోనా భారిన పడ్డారు. కాబట్టి .. ఇప్పటికైనా కరోనా నియమాలకు లోబడి మలచుకుంటే కొంచెం కరోనా వ్యాప్తిని అడ్డుకునే పరిస్థితులు ఉంటాయి. అలా కాదు నాకు కరోనా సోకదు అనే నమ్మకం తో విచ్చల విడిగా రోడ్లపై తిరిగితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటారు.