Begin typing your search above and press return to search.

చదివింది ఇంటర్ లోపే కానీ సీఎం, మంత్రులుగా భాద్యతలు !

By:  Tupaki Desk   |   3 May 2021 2:30 PM GMT
చదివింది ఇంటర్ లోపే కానీ సీఎం, మంత్రులుగా భాద్యతలు !
X
ప్రస్తుత రోజుల్లో చదువే దేనికైనా దారి చూపేది. అందుకే అందరూ మొదటి ప్రాధాన్యత చదువుకి ఇస్తున్నారు. అలాగే చిన్నది కానీ పెద్దది కానీ ప్రభుత్వం ఉద్యోగం రావాలి అంటే చదువు ఉండాల్సిందే. కలెక్టర్ కావాలంటే ఏదో ఒక డిగ్రీ చదవాలి, డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాల్సిందే. కానీ, ప్రజలని పాలిస్తూ, దేశాన్ని ముందుకు నడిపించే రాజకీయ నేతలకి మాత్రం చదువు ముఖ్యం కాదు. నాయకత్వ లక్షణమే ముఖ్యం. నాయకత్వ లక్షణాలు ఉంటే, విద్యార్హతతో సంబంధం లేకుండానే వారిని అందలాలు ఎక్కిస్తారు. ఎన్నో ఉన్నత పదవులు కూడా వారిని వరిస్తాయి. కొన్ని కొన్ని సార్లు కుటుంబ నేపథ్యాలు కూడా ఇందుకు కలిసి వస్తుంటాయి. అతి తక్కువ చదువుతోనే మంత్రులుగా , ముఖ్యమంత్రులుగా రాజకీయాల్లో కీలక పదవులను పొందిన ఓ ఎనిమిది మంది నేతల గురించి ఇప్పుడు చూద్దాం ..

రబ్రీ దేవి : బిహార్ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా సేవలు చేసిన రబ్రీదేవి. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా తన భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. 1997 నుంచి 2005 మధ్యలో సీఎంగా ఉన్న ఆమె అధికారిక క్యాండిటేట్ అఫిడవిట్‌లో ‘‘నాన్-మెట్రిక్’’ అని పొందుపరిచారు. అంటే ఆమె కనీసం పది కూడా పూర్తి చేయలేదు. కేవలం 14 ఏళ్లకే వివాహం చేసుకుంది. అయినా కూడా సీఎం గా విశేష సేవలు చేశారు.

గుల్జార్ సింగ్ రాణికే : పంజాబ్ లో మాజీ మంత్రి అయిన రాణికే. శిరోమణి అకాలీ దళ్ పార్టీ సభ్యులు. 2007 నుంచి 2017 మధ్య యానిమల్ హస్పెండరీ, డైరీ అండ్ ఫిషరీస్, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ వంటి కీలకమైన విభాగాల్లో మంత్రిగా సేవలు అందించారు. దీనికితోడు 2007-12 మధ్యలో స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ శాఖకు కూడా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌ బీర్ సింగ్ బాదల్‌ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇన్ని కీలకమైన పదవులు నిర్వహించిన ఈయన విద్యార్హత విషయానికొస్తే, ఆయన కేవలం ప్రాథమిక విద్య (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) మాత్రమే పూర్తిచేశారు.

స్మృతి ఇరానీ..

కేంద్ర మంత్రి, గడిచిన నాలుగైదేళ్లలో బాగా గుర్తింపు పొందిన మహిళా రాజకీయ నేతల్లో స్మృతి ఇరానీ ఒకరు. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో టెక్స్‌టైల్ విభాగం, మహిళ మరియు శిశు అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న ఆమె గతంలో సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ, అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. అయితే 12వ తరగతి ప్యాసైన ఆమె.. చదువు కొనసాగించడం కోసం ఢిల్లీ యూనివర్సీటీలోని స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్‌ లో చేరినట్లు సమాచారం.

ఉమా భారతి : బీజేపీకి చెందిన పాపులర్ నేతల్లో ఈమె కూడా ఒకరు. మద్యప్రదేశ్ రాష్ట్రానికి మాజీ సీఎం. బీజేపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయిలో పలు కీలక పదవులు నిర్వహించిన ఆమె, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవులు కూడా చేపట్టారు. 2000 నుంచి హ్యూమన్ రిసోర్సెస్ శాఖ, టూరిజం, యువజన వ్యవహారాలు, క్రీడలు, కోల్ అండ్ మైన్స్ శాఖలకు మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత 2014లో నీటి వనరులు, రివర్ డెవలప్‌ మెంట్ అండ్ గంగా రిజువనేషన్ విభాగాలకు మంత్రిగా ఉన్నారు. 2017 -19 మధ్య తాగునీరు, శానిటైజేషన్ మంత్రిగా పనిచేశారు. ఎలక్షన్ కమిషన్‌కు ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె విద్యార్హత 6వ తరగతి.

తేజస్వీ యాదవ్ : సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎదురు నిలబడి గట్టి పోటీ ఇచ్చిన నాయకుడు తేజస్వీ యాదవ్. 2015లో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ సభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికవడంతో తేజస్వీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పటి వరకూ క్రికెటర్ అవ్వడం కోసం ఆయన కష్టపడుతూ వచ్చారు. అయితే అక్కడ విఫలం అవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. 26 ఏళ్ల వయసులో డిప్యూటీ సీఎం పదవి పొందిన తేజస్వీ.. భారతదేశంలో ఒక రాష్ట్రానికి అతి చిన్న వయసులో డిప్యూటీ సీఎం అయిన నేతగా రికార్డు సృష్టించారు. తేజస్వీ యాదవ్ చదివింది 9వ తరగతి మాత్రమే.

తేజ్ ప్రతాప్ యాదవ్..

లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడైన తేజ్ ప్రతాప్ వయసు.. సర్టిఫికెట్లలో మాత్రం తేజస్వీ కన్నా ఒక సంవత్సరం చిన్నవాడిగా నమోదైంది. తేజ్ ప్రతాప్ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడిచి 2015లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మాహువా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 వరకూ నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ, పర్యావరణ శాఖ మంత్రులుగా సేవలందించారు.తేజ్ ప్రతాప్ కూడా సోదరుడు తేజస్వీలాగే 9వ తరగతి ప్యాసయ్యారు.

విష్ణు డియో సాయి..

బీజేపీ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉక్కు శాఖ కేంద్ర మాజీ సహాయమంత్రి విష్ణు డియో సాయి. ఆయన తన రాజకీయ ప్రస్థానంలో మరో రెండు కీలక పదవుల్లో సేవలందించారు. రైతు కుటుంబానికి చెందిన విష్ణు.. ఛత్తీస్‌గఢ్‌లోని కుంకురిలో ఉన్న లయోలా హైయర్ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి ప్యాసయ్యారు.

అనంత్ గీతే..

శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో ఒకరైన అనంత్ గీతే.. మాజీ కేంద్రమంత్రి. భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రిగా గతంలో సేవలందించారు. దాదాపు 2 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న గీతే.. విద్యార్హత మాత్రం కేవలం 10వ తరగతే.