Begin typing your search above and press return to search.

లోన్స్ రిక‌వ‌రీ ఏజెంట్ల‌కు ఆర్బీఐ తాజా హెచ్చ‌రిక‌లు ఇవే!

By:  Tupaki Desk   |   13 Aug 2022 8:44 AM GMT
లోన్స్ రిక‌వ‌రీ ఏజెంట్ల‌కు ఆర్బీఐ తాజా హెచ్చ‌రిక‌లు ఇవే!
X
వినియోగ‌దారుల‌ను వేధిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని లోన్స్ రిక‌వ‌రీ ఏజెంట్ల‌ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చ‌రించింది. లోన్లు క‌ట్టాలంటూ రుణ గ్ర‌హీత‌ల‌ను స‌మ‌యంతో ప‌నిలేకుండా వేధించ‌డం కుద‌ర‌ద‌ని ఆర్‌బీఐ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు తాజాగా అద‌న‌పు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆర్బీఐ విడుద‌ల చేసింది.

రుణ‌గ్ర‌హీత‌ల‌కు సంబంధిత లోన్ రిక‌వ‌రీ ఏజెంట్లు ఉద‌యం 7 దాటాక.. రాత్రి 8లోపు మాత్ర‌మే చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఉద‌యం 7 గంట‌లలోపు, రాత్రి 8 గంట‌లు దాటాక ఫోన్లు చేసి రుణ‌గ్ర‌హీత‌ల‌ను వేధించ‌వ‌ద్ద‌ని కోరింది. అదేవిధంగా తీసుకున్న లోన్లు చెల్లించాల‌ని బెదిరించ‌డం కూడా స‌రికాద‌ని తేల్చిచెప్పింది. ఈ మేర‌కు వివిధ బ్యాంకులు, సూక్ష్మ ఆర్థిక కార్పొరేష‌న్లు, త‌దిత‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది.

ముఖ్యంగా రుణాలను వసూలు చేసే ఏజెంట్లు భౌతికంగా లేదా మాటల రూపంలో రుణ‌గ్ర‌హీత‌ల‌పై వేధింపులకు పాల్పడకుండా ఆర్‌ఈలు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. ఈ విషయాన్ని బ్యాంకులు తమ ఏజెంట్లకు స్పష్టంగా తెలియజేయాల‌ని సూచించింది. ఏ రూపంలోనూ రుణ‌గ్ర‌హీత‌ల‌కు అనుచిత సందేశాలు పంపకూడదని, గుర్తు తెలియని కాల్స్‌ రూపంలో వేధించకూడదని ఖ‌రాఖండీగా తేల్చిచెప్పింది.

అదేవిధంగా రుణగ్రహీతల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకూ పాల్పడకూడదని పేర్కొంది. అప్పు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకూ, రిఫరెన్సుగా పేర్కొన్న వారికీ, స్నేహితులకు మొబైల్‌ లేదా సామాజిక వేదికల ద్వారా సందేశాలు పంపించకూడద‌ని వెల్ల‌డించింది. అదేవిధంగా వారిని భయపెట్టేందుకు ప్రయత్నించడం కూడా స‌రికాద‌ని పేర్కొంది.

రుణగ్రహీత గురించి ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయొద్ద‌ని కూడా ఆర్బీఐ తన తాజా నోటిఫికేషన్‌లో పేర్కొంది. రుణాలు వ‌సూలు చేసే బాధ్య‌త‌ల‌ను వేరే ఔట్‌సోర్సింగ్‌ సంస్థలకు ఇచ్చిన‌ప్పుడు సంబంధిత రికవరీ ఏజెంట్లు పాల్ప‌డే చర్యలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది.

లోన్ రికవరీ ఏజెంట్లు, ముఖ్యంగా వివిధ ఆన్‌లైన్ లోన్ యాప్ సంస్థ‌లు ఇటీవలి కాలంలో ఆమోదయోగ్యం కాని చర్యలకు పాల్పడుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఆర్బీఐ ఈ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు అన్ని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ సంస్థలు, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు, అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకూ వ‌ర్తిస్తాయ‌ని ఆర్బీఐ స్ప‌ష్టం చేసింది.