Begin typing your search above and press return to search.

అందరూ ఎన్టీఆర్ బాట పడితే.. విధేయ మంత్రి మాత్రం దూరంగా

By:  Tupaki Desk   |   29 May 2022 4:31 AM GMT
అందరూ ఎన్టీఆర్ బాట పడితే.. విధేయ మంత్రి మాత్రం దూరంగా
X
నందమూరి తారక రామారావు శతజయంతి తొలి రోజున.. తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర సన్నివేశం ఒకటి ఆవిష్కృతమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లటం.. ఆయన సమాధికి నివాళులు అర్పించటం చేశారు. వీరిలో మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఇలా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. సాధారణంగా ఎన్టీఆర్ జయంతి అన్నంతనే పసుపు దండు మాత్రమే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లేది. మనసులో అభిమానం ఉన్నప్పటికీ.. పార్టీ లైన్ విషయంలో తేడా వస్తుందన్న భావనతో ఎన్టీఆర్ ఘాట్ దరిదాపుల్లోకి మాత్రం వెళ్లే వారు కాదు.

అందుకు భిన్నంగా శుక్రవారం సీన్ చోటు చేసుకుంది. గులాబీ పార్టీకి చెందిన పలువురు నేతలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లిన వైనం ఆసక్తికరంగా మారింది. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవల్ని ప్రస్తుతిస్తూ ఘనంగా నివాళులు అర్పించిన వైనం సరికొత్తగా మారింది. ఇన్నాళ్లు ఎన్టీఆర్ ఊసు ఎత్తని టీఆర్ఎస్ నేతలు కొందరు తాజాగా ఎన్టీఆర్ ను మీద వేసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లిన వారిలో రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి.. పువ్వాడ అజయ్.. ఎంపీ నామా నాగేశ్వరరావు.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ.. మాగంటి గోపీనాథ్.. భాస్కర్ రావు.. ఎమ్మెల్సీ నవీన్ రావు.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. ఇంకొందరు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దానం నాగేందర్ లాంటి హార్డ్ కోర్ కాంగ్రెస్.. ఇప్పుడు టీఆర్ఎస్ అనుకోండి.. ఆయన కూడా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తే.. టీడీపీలో సుదీర్ఘకాలం ఉండటంతో పాటు.. హైదరాబాద్ టీడీపీలో ప్రత్యేక గుర్తింపు పొంది.. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో సాగుతున్న వేళలోనూ పార్టీ లైన్ వినిపించిన దమ్మున్న నేతగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రత్యేక గుర్తింపు ఉండేది.

మరి.. అలాంటి నేత మాత్రం ఎన్టీఆర్ జయంతి రోజున నిర్వహించిన ఏ కార్యక్రమంలోనూ ఆయన హాజరు కాలేదు. అంతేకాదు.. కనీసం నివాళి కూడా అర్పించకపోవటం విశేషం. మిగిలిన గులాబీ నేతలు ఎన్టీఆర్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తే.. వీరికి భిన్నంగా తలసాని మాత్రం ఎన్టీఆర్ జయంతి వేడుకలకు దూరంగా ఉండిపోయిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో కేసీఆర్ కు వీర విధేయుడిగా మారిన వైనం తెలిసిందే.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చిన రెండు దఫాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం తప్పించిన వేళ.. రాష్ట్ర ప్రతినిధి హోదాలో ప్రధానమంత్రికి స్వాగతం పలికే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో.. కేసీఆర్ కు ఆయన ఎంత విశ్వసనీయమైన వ్యక్తి అన్నది అందరికి తెలిసేలా చేసింది.

ఈ వీర విధేయ గుర్తింపునకు డ్యామేజ్ కలగకూడదని అనుకున్నారో ఏమో కానీ.. ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి కూడా.. ఎన్టీఆర్ శత జయంతి లాంటి ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండటం ఏమిటన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.