Begin typing your search above and press return to search.

వాట్సాప్ విధ్వంసకాండ: 'కరెక్ట్ గా 3.10కి స్టార్ట్ యుద్ధం'

By:  Tupaki Desk   |   29 May 2022 5:50 AM GMT
వాట్సాప్ విధ్వంసకాండ: కరెక్ట్ గా 3.10కి స్టార్ట్ యుద్ధం
X
కోనసీమ జిల్లా ముందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టే అంశాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన అసాధారణ పరిస్థితుల్ని నెలకొనేలా చేయటమే కాదు.. భారీ ఎత్తున విధ్వంస కాండ సాగిన వైనం తెలిసిందే. రాష్ట్ర మంత్రి విశ్వరూప్ కు చెందిన రెండు ఇళ్లను తగలబెట్టేయటమే కాదు.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టేయటం తెలిసిందే. ఈ విధ్వంసకాండలో పోలీసులు సైతం పెద్ద ఎత్తున గాయపడ్డారు.

ఈ మొత్తం హింసాకాండకు స్క్రీన్ ప్లే.. డైరెక్షన్ మొత్తం వాట్సాప్ గ్రూపుల ద్వారానే సాగిన విషయాన్ని తాజాగా పోలీసులు గుర్తించారు. చలో అమలాపురం కలెక్టరేట్ కు పిలుపునిచ్చిన ఆందోళనకారులు ఉదయం నుంచి పెద్దగా కనిపించకపోవటం.. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వేలాది మంది ఒక్కసారిగా రావటంతో పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయితే.. ఇదంతా పక్కా ప్లాన్ తో సాగిన వైనాన్ని పోలీసులు గుర్తించారు.

తాజాగా అమలాపురం విధ్వంసకాండకు సంబంధించి ఏలూరు డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము సేకరించిన ఆధారాల్ని బయటపెట్టారు. ‘సరిగ్గా 3.10 గంటలకు స్టార్ట్ యుద్దం’ అంటూ వాట్సాప్ లో ఒక సందేహం.. ‘పోలీసువారు భోజనాలు చేస్తున్నారు. ఇదే మంచి సమయం. అమలాపురం టౌన్ లోకి రావటానికి’ లాంటి సందేశాలు ఈ నెల 24న వాట్సాప్ గ్రూపుల్లో గంపగుత్తగా వెళ్లాయని.. అదే ఇంతటి విధ్వంసకాండకు కారణమైందన్న విషయాన్ని తమ విచారణలో గుర్తించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

అమలాపురం విధ్వంసంలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు పలు విధానాల్ని అనుసరిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. తమకున్న సమాచారం ప్రకారం దాదాపు 20 వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని పంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ సందేశాల్లో ఎప్పుడు.. ఎంత మంది.. ఎక్కడకు చేరుకోవాలన్న వివరాల్ని తెలిపే మెసేజ్ లు కూడా ఉన్నాయన్నారు.

అయితే.. మెసేజ్ లను డిలీట్ చేయగా.. వాటన్నింటిని మళ్లీ రిట్రీట్ చేసే సాంకేతికతతో పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విధ్వంసకాండకు కారణమైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరింత మందిని రానున్న రోజుల్లో గుర్తించి అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.

అయితే.. అమాయకుల మీద కేసులు పెట్టమని చెబుతున్న అధికారులు.. అరెస్టు చేసిన వారి ఆస్తులను జఫ్తు చేస్తామని చెప్పటం గమనార్హం. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ అరెస్టుల వ్యవహారం మరింత లోతుగా సాగనుందన్న మాట వినిపిస్తోంది.