Begin typing your search above and press return to search.

జమిలి పై ఏకాభిప్రాయం సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   26 Jan 2022 8:55 AM GMT
జమిలి పై ఏకాభిప్రాయం సాధ్యమేనా ?
X
ఒకపుడు బాగా చర్చలు జరిగిన జమిలి ఎన్నికలపై మళ్ళీ చర్చ మొదలైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేర్వేరు వేదికలపై మాట్లాడుతూ జమిలి ఎన్నికల నిర్వహణపై ఏకాభిప్రాయం జరపాలన్నారు. ఒక వైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇదే జమిలి ఎన్నికల జపం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో మోడీ చేసిన జపం కారణంగా 2022లోనే లోక్ సభ + వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోతాయా అన్నంత చర్చ జరిగింది.

జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమీషన్ను కసరత్తు చేయమన్నారు. ఈసీ కూడా రాజకీయ పార్టీలన్నింటినీ పిలిచి చర్చలు జరిపి జమిలి ఎన్నికలు సాధ్యం కాదని తేల్చింది. ఆ తర్వాత మరోసారి సమావేశం జరిపి జమిలికి ఓకే చెప్పింది. ఆ తర్వాత ఏమైందో ఏమో మోడీ మళ్ళీ జమిలి మాటెత్తలేదు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా జమిలి ప్రస్తావన చేశారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటోంది.

ఈ కారణంగానే ఇటు లోక్ సభ అటు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తే బీజేపీకి తిరుగుండదనేది మోడీ భావన. అయితే జమిలి ఎన్నికల నిర్వహణ అనుకున్నంత ఈజీ కాదనేది ఎలక్షన్ కమీషన్, రాజకీయ పార్టీల అభిప్రాయం. ఎందుకంటే లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలే ఒక్క రాష్ట్రంలో ఒక్కసారి జరుగుతాయి. జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయమైతే ఇంకా కాలపరిమితున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వాలను రద్దు చేసుకోవటానికి ఇష్టపడతాయా ? అన్నదే పెద్ద సమస్య.

జమిలిపై మోడీ ఊపు చూసే రాష్ట్రంలో చంద్రబాబునాయుడు కూడా జమిలి జపం చేశారు. 2022లో జమిలి ఎన్నికలు ఖాయమని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీదే అధికారమంటు క్యాడర్ కు పదే పదే చెప్పారు. తర్వాత మోడి సైలెంట్ అయ్యేసరికి చంద్రబాబు కూడా మళ్ళీ నోరెత్తలేదు. అలాంటిది ఇపుడు హఠాత్తుగా వెంకయ్యనాయుడు జమిలి జపం ఎందుకు మొదలుపెట్టారో అర్థం కావటం లేదు. పైగా ఏకాభిప్రాయం సాధించాలంటున్నారు. జమిలిపై ఏకాభిప్రాయం సాధ్యం కాదని అందరికీ తెలుసు. మరి తెలిసీ ఎందుకీ జపం ?