Begin typing your search above and press return to search.

బ్రాండ్ హైద‌రాబాద్‌ను బ్రాండీ హైద‌రాబాద్ చేశారు

By:  Tupaki Desk   |   13 Dec 2019 1:30 AM GMT
బ్రాండ్ హైద‌రాబాద్‌ను బ్రాండీ హైద‌రాబాద్ చేశారు
X
ఏపీలో విడతల వారీగా మద్యనిషేధం అమలు చేస్తామన్న కొత్త ప్రభుత్వం దానికి అనుగుణంగా వైన్సులు, బార్ల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. దీంతో స‌హ‌జంగానే పొరుగున‌ ఉన్న తెలంగాణ‌లో కూడా మ‌ద్యంపై స‌ర్కారు వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌ద్యంపై స‌ర్కారు తీరును అంతా గ‌మ‌నిస్తున్న‌ స‌మ‌యంలో బీజేపీ కీల‌క ముంద‌డుగు వేసింది. బీజేపీ నేత‌, మాజీ మంత్రి డి.కె. అరుణ రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేప‌ట్టారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆమె చేప‌ట్టిన‌ దీక్షకు మ‌ద్యం బాధిత కుటుంబాలు కూడా హాజరయ్యాయి. ఈ ప్రాంగ‌ణాన్ని సంద‌ర్శించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. బ్రాండ్ హైదరాబాద్ ను బ్రాండీ హైదరాబాద్ గా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే చెందుతుందని అన్నారు.

తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చిన ఘనట కేసీఆర్‌కు చెందుతుందని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఆదాయం కోసం లిక్కర్ ను ఏరులై పారిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం 80వేల కోట్ల రూపాయల రాబడి ఉంటే...20వేల కోట్లు మద్యం అమ్మకంద్వారా రాబడుతోందని ఆయన చెప్పారు. మద్యనియంత్రణ శాఖను.. మద్యాన్ని పెంచే శాఖగా మార్చారని ఆయన ఆరోపించారు. లిక్కర్ పై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ ఉండాలని డిమాండ్ చేశారు. పలు నేరాలకు మద్యమే ముఖ్యకారణ‌మని ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌పై సైతం ల‌క్ష్మ‌ణ్ విరుచుకుప‌డ్డారు. మనది గాని పబ్ కల్చర్ ను ప్రజలనెత్తిన రుద్దుతున్నారని అన్నారు. ట్విటర్ పిట్ట కేటీఆర్ మాత్రం గొప్పలకు పోతాడని చెప్పారు.బీజేపీ బేటీ బచావో.. బేటీ పడావో అంటే… కేసీఆర్ మాత్రం బార్ బచావో బార్ బడావో అని అంటున్నరని అన్నారు. లిక్కర్ ద్వారా ఎన్ని నేరాలు జరిగినా స‌ర్కారుకు చీమకుట్టిన‌ట్లు కూడా లేదని ఆరోపించారు. 90వ దశకంలో దూబగుంటలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం చివరికి మద్య నిషేధ ఉద్యమంగా మారి ఓ ఏడాదిన్నర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అమలు దిశగా అడుగులు పడిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఏపీలో మద్యనిషేధాన్ని క్రమంగా ఎత్తేశారు. తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన మ‌ద్య నిషేధం డిమాండ్‌ను కేసీఆర్ ఏ విధంగా ప‌రిష్క‌రిస్తార‌నేది ఆస‌క్తిక‌రం.