Begin typing your search above and press return to search.

బాబుపై కన్నబాబు ఫైరింగ్..ఏ రేంజిలో ఉందంటే?

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:20 PM GMT
బాబుపై కన్నబాబు ఫైరింగ్..ఏ రేంజిలో ఉందంటే?
X
టీడీపీ అధినేత - ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ కీలక నేత - మంత్రి కురసాల కన్నబాబు నిజంగానే ఓ రేంజిలో ఫైరయ్యారు. అధికార వికేంద్రీకరణ - సీఆర్డీఏ రద్దు విషయంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో పాలుపంచుకున్న కన్నబాబు... రాజధానిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలి కౌంటర్ ఇచ్చారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతానని పేర్కొన్న చంద్రబాబు... తన మార్కు నిర్ణయాలతో అమరావతిని నాశనం చేశారని విరుచుకుపడ్డ కన్నబాబు... బాబు తీసుకున్న అపసవ్య నిర్ణయాలే ఆయనను అధికారం నుంచి దించేశాయన్న విషయాన్ని కన్నబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాకుండా ఆకాశంలో విహరిస్తున్నట్లుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న చంద్రబాబును నేలకు దించింది సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని కూడా కన్నబాబు తనదైన శైలి సంచలన కామెంట్లు చేశారు.

అసలు చంద్రబాబుపై కన్నబాబు ఏ రేంజిలో ఫైరయ్యారన్న విషయానికి వస్తే... ‘కులీ కుతుబ్ షా మాదిరిగా ఒక మహా నగరాన్ని నిర్మించాలని, శాశ్వతమైన కీర్తి దక్కాలని ఎవరైనా కోరుకోవడంలో తప్పులేదు. చేసే పనిలో ఆత్మ ఉంటే... ప్రజలు కూడా హర్షిస్లే... కీర్తి దానంతటదే వస్తుంది. బయటి ప్రపంచమంతా అమరావతిని పర్యావరణం నాశనం చేసే నగరంగానే చూస్తున్నారే తప్ప... చంద్రబాబు చెప్పినట్లు అంతర్జాతీయ ప్రమాణాలున్న కలల నగరంగా చూడటం లేదు. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉంది. ఇలా చట్టం చేసిన వెంటనే జోలె పట్టిన స్థాయికి దిగజారిపోయారు. తన మీద కోపంతోనో, ఒక సామాజిక వర్గం మీద కోపంతోనే రాజధానిని మార్చొద్దంటూ చంద్రబాబు వినిపిస్తున్న వాదన తప్పు. ఒకప్పుడు 29 రాష్ట్రాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబు ఇప్పుడు 29 గ్రామాల్లో జోలె పట్టే స్థాయికి దింపింది సీఎం జగనే. అలాంటప్పుడు చంద్రబాబుపై సీఎం కోపం పెంచుకుంటారన్న మాటకు అర్థమే లేదు. 29 రాష్ట్రాల నుంచి 29 గ్రామాల స్థాయికి పడిపోయాగడంటే అంతకంటే రాజకీయ పతనం ఇంకేముంటుంది? ’ అంటూ కన్నబాబు ఓ రేంజిలో ఫైరయ్యారు.

ఇక కేవలం ఒక సామాజిక వర్గాన్ని దెబ్బ తీయడం కోసమే రాజధానిని తరలిస్తున్నారన్న చంద్రబాబు వాదనను కూడా కన్నబాబు తప్పుబట్టారు. ఏడాదికి మూడు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మించవద్దని అప్పటి శివరాకృష్ణ కమిటీ నుంచి నిన్నటి హైపవర్ కమిటీ దాకా సూచించాయని, అయినా సరే వినకుండా గ్రీన్ ఫీల్డ్ సిటీ పద్దతిని ఎంచుకుని చంద్రబాబు ప్రభుత్వం బొక్క బోర్లా పడిందని కన్నబాబు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. సీఎం చుట్టూ ఉండే వాళ్లలో చంద్రబాబు సామాజికవర్గానికి చెవందిన వాళ్లు కూడా ఉన్నారని... రఘురాం, కొడాలి నాని లాంటి వందల మంది అభిమానులు జగన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడబోరని కూడా కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ .జీవితంలో ఏనాడూ ప్రజల కోసం ఆలోచించని చంద్రబాబు... సడెన్ గా ఇప్పుడు అమరావతి కోసం జోలె పట్టడంలో పెద్ద మతలబు ఉందని వ్యాఖ్యానించిన కన్నాబు.. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రం దారుణంగా నష్టపోయిందని కూడా కన్నబాబు వ్యాఖ్యానించారు. మొత్తంగా తనదైన శైలి వ్యాఖ్యలతో కన్నబాబు... చంద్రబాబుపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారని చెప్పాలి.