Begin typing your search above and press return to search.

దావోస్ లో కేటీఆర్... పిచాయ్ సహా దిగ్గజాలతో భేటీ

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:03 PM GMT
దావోస్ లో కేటీఆర్... పిచాయ్ సహా దిగ్గజాలతో భేటీ
X
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాలుపంచుకునేందుకు దావోస్ వెళ్లిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బిజీబిజీగా గడుపుతున్నారు. దావోస్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో తిష్ట వేసిన కేటీఆర్ తొలి రోజు కంటే కూడా బుధవారం రెండో రోజు కూడా బిజీబిజీగానే గడిపారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు చెందిన సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సీఈవోలు, గ్రూప్ చైర్మన్లు పాల్గొన్నారు. దావోస్ లో జరిగిన ఒక బిజినెస్ మీటింగ్ లో గూగుల్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ లో గూగుల్ కార్యకలాపాలతో పాటు, దాని భవిష్యత్తు విస్తరణ పై వారిద్దరూ చర్చించారు.

అనంతరం ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ కూడా కేటీఆర్ ని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని ఈ సందర్భంగా ఆయనకు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. రాక్ వెల్ అటోమేషన్ సియివో ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, కెటిఆర్ ను కలిశారు.

230 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య తో కూడా కేటీఆర్ సమావేశయ్యారు. హైదరాబాద్ ఇండియా యొక్క లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ రాజధానిగా ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. అంతేకాక మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె గోయెంకా, కేపీఎంజీ గ్లోబల్ చైర్మన్ మరియు సిఈవో బిల్ థామస్, ఐడియో సీఈఓ శాండీ స్పీచర్, హెచ్ సీ ల్ టెక్నాలజీస్ సీటీవో కళ్యాణ్ కుమార్ లతో కూడా కేటీఆర్ సమావేశయ్యారు. మొత్తంగా అందుబాటులో ఉన్న పారిశ్రామికవేత్తల్లో చాలా మందినే కలిసి మంతనాలు సాగించిన కేేటీఆర్... రోజంతా బిజీబిజీగానే గడిపారు.