Begin typing your search above and press return to search.

ఫ‌ర్నిచ‌ర్ కేసులో కోర్టుముందుకు కోడెల శివ‌రాం

By:  Tupaki Desk   |   9 Oct 2019 3:24 PM GMT
ఫ‌ర్నిచ‌ర్ కేసులో కోర్టుముందుకు కోడెల శివ‌రాం
X
దివంగ‌త టీడీపీ సీనియ‌ర్‌ నేత - ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం బుధవారం మంగళగిరి కోర్టు ఎదుట లొంగిపోయారు. ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్‌ ను దాచిపెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాలతో ఆయన నేడు మంగళగిరి కోర్టు ముందు హాజరయ్యారు. దీనిపై శివరాం లాయర్‌ అబ్దుల్‌ రజాక్‌ మాట్లాడుతూ శివరాంకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో అందుకు సంబంధించిన షూరిటీలను ఆయన మంగళగిరి కోర్టుకు అందజేశారు. ప్రతి శుక్రవారం ఆయన తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ కు హాజరై సంతకం పెట్టాల్సి ఉంటుంద‌ని లాయ‌ర్ ర‌జాక్ తెలిపారు.

తన తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్‌ గా వ్యవహరించిన కాలంలో అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నీచర్ మాయం అయింది. దాదాపు ల‌క్ష‌ల వ్య‌యం అయ్యే ఈ ఫ‌ర్నిచ‌ర్ శివరాంకు చెందిన షోరూమ్‌ లో లభించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శివరాంపై సెక్షన్‌ 409 - 411 ల కింద కేసు నమోదైంది. ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో న‌వ్యంధ్ర ప్ర‌దేశ్ కు ఫ‌ర్నిచ‌ర్‌ ను కొంత కొనుగోలు చేయ‌గా - మ‌రికొంత హైద‌రాబాద్ నుంచి డీసీఎంల‌తో తెచ్చారు. అయితే తెచ్చిన ఫ‌ర్నీచ‌ర్ కొంత స్పీక‌ర్ చాంబ‌ర్‌ కు... మ‌రికొంత కొడుకు శివ‌రాం షోరూంకు త‌ర‌లింద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

ఈ ఫ‌ర్నిచ‌ర్ త‌ర‌లింపుపై టీడీపీ ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో ఫ‌ర్నిచ‌ర్ ఇక మాయం అయిన‌ట్లే అనుకున్నారంతా..కానీ ఏపీలో అధికారం చేతులు మార‌డంతో ఫ‌ర్నిచ‌ర్ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఫ‌ర్నిచ‌ర్‌పై పోలీస్‌ స్టేష‌న్ ల‌లో కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో విచార‌ణ జ‌రుప‌గా ఫ‌ర్నిచ‌ర్ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు త‌న ఇంటికి త‌ర‌లించిన‌ట్లు రుజువులు దొరికాయి. అయితే కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా కిమ్మ‌న‌కుండా ఉండిపోయారు.

ఎప్పుడైతే కేసులు న‌మోదు అయ్యాయో.. అప్పుడు కోడెల స్వ‌యంగా ఫ‌ర్నిచ‌ర్ త‌ర‌లింపు సంద‌ర్భంగా అది నా ఇంటికి వ‌చ్చింద‌ని - నేను దాన్ని అక్ర‌మంగా త‌ర‌లించ‌లేద‌ని ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ రాసారు. అయితే త‌రువాత ఫ‌ర్నిచ‌ర్‌ ను కోడెల కుమారుడు శివ‌రాం కు చెందిన వాహ‌న షో రూం నుంచి రిక‌వ‌రి చేశారు. ఈ కేసులోనే శివ‌రాంను పోలీసులు అరెస్ట్ చేయ‌కుండా ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖాలు చేయ‌డంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పుడు కోర్టులో లొంగిపోయిన శివ‌రాం కోర్టు బెయిల్ ప‌త్రాలు స‌మ‌ర్పించారు.