Begin typing your search above and press return to search.

సెక్స్ రాకెట్, సొంత పార్టీ నేతల్ని కాల్చి చంపించిన కిమ్ జాంగ్ ఉన్!

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:30 PM GMT
సెక్స్ రాకెట్, సొంత పార్టీ నేతల్ని కాల్చి చంపించిన కిమ్ జాంగ్ ఉన్!
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎంతటి నియంతనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా, రాజధాని ప్యోంగ్‌యాంగ్‌లో వెలుగుచూసిన సెక్స్ రాకెట్‌పై ఆగ్రహోద్రుడయ్యాడు. ఇందుకు కారణమైన ఆరుగురు నిందితులను రాజధానిలో బహిరంగంగా కాల్చి చంపించాడు. ఇందులో నలుగురు కిమ్ సారథ్యంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాకు చెందినవారే. ఇరవై రోజుల క్రితం అంటే జూలై 20న ఈ ఘటన జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సెక్స్ రాకెట్‌లో పట్టుబడిన అమ్మాయిలు కూడా ప్యోంగ్‌యాంగ్‌కు చెందిన విద్యార్థినులే. వీరు తమ ఖర్చుల కోసం వ్యభిచార కూపంలోకి వచ్చారు. 20 ఏళ్ల వయస్సు లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. వీరు పడుపు వృత్తి ద్వారా ప్రతి నెల 500 డాలర్ల వరకు సంపాదిస్తున్నారట. ఈ సెక్స్ రాకెట్‌లో సొంత పార్టీకి చెందిన నలుగురు కూడా కీలకంగా ఉన్నట్లు కిమ్ దృష్టికి వచ్చింది. అమ్మాయిలకు మొదట డబ్బు ఆశ చూపి, ఆ తర్వాత బలవంతంగా లేదా బెదిరించి ఈ కూపంలోకి దింపుతున్నట్లు గుర్తించారు.

దీంతో ఆగ్రహించిన కిమ్ జాంగ్ ఉన్ నిందితులను కాల్చి పారేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు వారిని బహిరంగంగా కాల్చి చంపారు. ఇలా పట్టుబడితే ఏడాది నుండి అయిదేళ్ల వరకు లేబర్ క్యాంపులో నిర్బంధించే చట్టం ఉంది. కానీ దీనిని ఉపేక్షించవద్దని కాల్చివేత నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా కిమ్ ఎక్కువగా ఇష్టపడే యూనివర్సిటీలకు చెందిన విద్యార్థినులే ఈ సెక్స్ రాకెట్‌లో ఉన్నారని తెలిసి, మరింత ఉగ్రరూపం దాల్చారట. ఉత్తర కొరియాలో బహిరంగ మరణశిక్షలు సాధారణం.