Begin typing your search above and press return to search.

కిడ్నాప్ కథలో ఎండింగ్ భయానకం

By:  Tupaki Desk   |   25 April 2019 9:24 AM GMT
కిడ్నాప్ కథలో ఎండింగ్ భయానకం
X
గుంటూరు జిల్లా మాచర్లలో బాలుడి కిడ్నాప్ విషాదంతంగా ముగిసింది. కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా వస్తాడని ఊహించిన ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలింది. కిడ్నాపర్లు ఆ బాలుడిని గొంతునులిమి చంపి క్వారీలోని నీళ్లలో వేయడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయాడు.

*కిడ్నాప్ ఎలా అయ్యాడు..?
గుంటూరు జిల్లా మాచర్లలోని నెహ్రూనగర్ లో వెంకటేశ్వర్లు-సరోజ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల సాయి సాత్విక్ అనే కుమారుడున్నాడు. ఈ నెల 22వ తేదీన సాయంత్రం సాయి సాత్విక్ ఇంటి బయట ఆడుకుంటున్నాడు. స్థానికంగా ఉన్న వారు సరోజ ఇంటికి వచ్చి సాత్విక్ ను ఎవరో ఎత్తుకెళుతున్నారని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*సీసీటీవీల్లో కిడ్నాపర్ తో బాలుడు..
పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించారు. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి గుర్తు తెలియని ఒక దుండగుడు కిడ్పాప్ చేసి బాలుడిని భుజాలపై తీసుకెళ్లడం సిసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అయితే బాలుడు ఏడవకపోవడం.. కిడ్పార్ తోపాటే వెళ్లడంతో అతడు తెలిసినవాడా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు..

*హత్య చేసి క్వారీ గుంతలో పడేశారు..
బాలుడి కిడ్నాప్ తర్వాత అతడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్న పోలీసులకు ఈనెల 25వ తేదీన మాచర్ల సమీపంలోని క్వారీ గుంతలో ఉన్న చెరువు లో చిన్నారి మృతదేహం ఉందని సమాచారం అందింది. దీంతో వారు వెళ్లి పరిశీలించగా సాయి సాత్విక్ అని తేలింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతిచెందింది సాయి సాత్విక్ అని తేల్చారు. దీంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

కిడ్నాపర్ల హత్యా ఘాతుకంపై పోలీసులు సీరియస్ గా విచారణ జరుపుతున్నారు. కిడ్నాపర్ ఎవరనే దానిపై విస్తృతంగా పరిశోధన జరుపుతున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది.? ఆర్థిక, సామాజిక, బంధుత్వ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేదానిపై తల్లిదండ్రులను విచారణ జరుపుతున్నారు. త్వరలోనే కిడ్నాపర్ ను పట్టుకుంటామని చెబుతున్నారు.