Begin typing your search above and press return to search.

బెజవాడ టీడీపీలో తుఫాన్.. రంగంలోకి బాబు.. అడ్డుకట్ట..

By:  Tupaki Desk   |   7 March 2021 2:30 AM GMT
బెజవాడ టీడీపీలో తుఫాన్.. రంగంలోకి బాబు.. అడ్డుకట్ట..
X
మున్సిపల్ ఎన్నికల సాక్షిగా తమకు టికెట్లు, ప్రాధాన్యత దక్కకపోవడంపై బెజవాడ టీడీపీలో అసమ్మతి చెలరేగిన సంగతి తెలిసిందే.. ఎంపీ కేశినేని నాని వర్సెస్ టీడీపీ సీనియర్లు బోండా ఉమా, బుద్దావెంకన్న, నాగుల్ మీరాల మధ్య సాగిన వార్ కు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. చంద్రబాబు రంగంలోకి దిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనార్ధన్, వర్ల రామయ్యలతో కలిసి నేతలను బుజ్జగించి రాజీ కుదిర్చారు.

విజయవాడ కార్పొరేషన్ లో కార్పొరేటర్ సీట్లను టీడీపీ ఎంపీ కేశినేని నాని పంచడం.. మేయర్ గా తన కుమార్తెను ప్రకటించడంపై టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దావెంకన్న, నాగుల్ మీరాల వ్యతిరేకించారు. తాము సహకరించమని.. అసమ్మతి రాజేశారు. చంద్రబాబు కావాలో.. కేశినేని నాని కావాలో తేల్చుకోవాలని ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకే సవాల్ చేశారు. కేశినేని నానికి దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీచేయాలని సవాల్ చేశారు.

ఇక టీడీపీ నేతలు సవాల్ చేయడంతో దీనిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశించిన మరుక్షణం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. తనపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. రేపు చంద్రబాబు పర్యటనకు సంబంధించి తాను రూట్ మ్యాప్ మార్చినట్టు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నాని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వమే కలిసి కార్పొరేటర్లకు సీట్లు పంచారని.. తనపై నేతలు చేసిన విమర్శలు సరికాదని హితవు పలికారు.

ఇలా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దావెంకన్న, నాగుల్ మీరాలు ఓవైపు.. ఎంపీ కేశినేని ఒకవైపు మాటల తూటాలు పేల్చడంతో చంద్రబాబు రంగంలోకి దిగారు. వెంటనే రాష్ట్ర నేతలను పంపి చర్చించారు. మేయర్ కేశినేని శ్వేతకు మద్దతు ఇచ్చేలా అసమ్మతి నేతలను ఒప్పించారు.ఈ క్రమంలోనే టీడీపీ మేయర్ అభ్యర్థి శ్వేత స్వయంగా బోండా ఉమా ఇంటికి వెళ్లారు. తనకు సహకరించాల్సిందిగా బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను కోరారు.

ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు, చంద్రబాబులు చెప్పడంతో అసమ్మతి నేతలు శాంతించారు. శ్వేతతోపాటు తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. టీడీపీ విజయం కోసం విభేదాలు మాని ఐక్యంగా పనిచేస్తామన్నారు.ఇలా బెజవాడ టీడీపీలో టీకప్పులో తుఫానులా చెలరేగిన అసమ్మతి చంద్రబాబు రంగ ప్రవేశంతో సమసిపోయింది. కార్పొరేటర్ సీట్ల కోసం సాగిన ఈ లొల్లి ఎట్టకేలకు సద్దుమణిగింది.