Begin typing your search above and press return to search.

నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారా?

By:  Tupaki Desk   |   28 Jun 2022 6:45 AM GMT
నిజామాబాద్ జిల్లాపై కేసీఆర్ ప్ర‌త్యేక దృష్టి పెట్టారా?
X
తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి టీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ అస్త్ర‌శ‌స్త్రాల‌కు ప‌దునుపెడుతున్నారా అంటే అవున‌నే అంటున్నారు.. విశ్లేష‌కులు. ముఖ్యంగా ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాపై ఆయ‌న ప్ర‌త్యేక దృష్టి పెట్టార‌ని చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె క‌విత ఓట‌మి పాల‌వ‌డంతో ఈసారి త‌న దృష్టి మొత్తం నిజామాబాద్ పైనే పెట్టార‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్.. కేసీఆర్ కు నివేదిక‌లు స‌మ‌ర్పించార‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లాలో 9కి 9 అసెంబ్లీ స్థానాల‌ను టీఆర్ఎస్ త‌న ఖాతాలో వేసుకుంది.

ఈ నేప‌థ్యంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అందుకు అనుగుణంగా పకడ్బందీగా వ్యవహరిస్తున్నార‌ని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రశాంత్‌ కిషోర్‌కు చెందిన ఐప్యాక్‌ బృందంతో ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో నెలల తరబడి అన్ని అంశాలపై స‌ర్వే చేయించార‌ని చెబుతున్నారు.

2018 డిసెంబ‌ర్ లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లాలో అన్ని సీట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ.. కొద్ది నెల‌ల వ్య‌వ‌ధిలో 2019 ఏప్రిల్ లో జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో షాక్ తింది. కేసీఆర్ గారాల ప‌ట్టి క‌విత నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా బ‌రిలోకి ఓట‌మి పాల‌య్యారు. దీంతో నిజామాబాద్ జిల్లాపై ఇప్ప‌టి నుంచే కేసీఆర్ దృష్టి పెట్టిన‌ట్టు చెబుతున్నారు. ఇంకా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాది, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మయం ఉంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ స్థానాల‌తో, పార్ల‌మెంటు స్థానంలో గెలుపొంద‌డానికి నిజామాబాద్ పై దృష్టి పెట్టార‌ని అంటున్నారు.

ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల‌ బలాలు, బలహీనతలను కూడా కేసీఆర్ తెలుసుకుంటున్నార‌ని పేర్కొంటున్నారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ అభ్య‌ర్థుల్లో కూడా ఇప్పుడు ఉన్న ఒక‌రిద్ద‌రిని మార్చే అవ‌కాశం ఉంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి, నడవడిక, అక్రమాలు, పర్సంటేజీలు, కేడర్‌కు అందుబాటులో లేని పరిస్థితి, భూదందాలు, దాడులు చేయించడం తదితర అంశాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొందరు సిట్టింగ్‌లను మార్చాల నే కేసీఆర్ యోచిస్తున్నార‌ని అంటున్నారు.