Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్.. కవిత రీఎంట్రీకి సిద్ధం

By:  Tupaki Desk   |   26 Sep 2020 8:50 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్.. కవిత రీఎంట్రీకి సిద్ధం
X
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అరవింద్ చేతిలో ఓడిపోయాక తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత రాజకీయంగా తెరమరుగయ్యారు. యాక్టివ్ లేకుండా సైలెంట్ అయ్యారు. ఏ కార్యక్రమంలో పాల్గొనకుండా కనుమరుగయ్యారు. ఎట్టకేలకు ఆమె నిరీక్షణకు తెరపడింది.

వచ్చేనెల 9న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్ ప్రకటించింది.. అదే నెల 12వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతామని పేర్కొంది. దీంతో 8 నెలల నుంచి వాయిదాపడుతూ వస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌ పడినట్లయింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇదివరకే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్‌ 7న ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉప సంహరణ అన్నీ ముగిసినా ఎన్నిక మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. ముందుగా మే 22 వరకు, ఆ తర్వాత 45 రోజులపాటు వాయిదా వేసింది. జూలై7 వరకు గడువు ఇచ్చినా కూడా కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఎన్నిక సాధ్యపడలేదు. ఎట్టకేలకు బీహర్ ఎన్నికలతోపాటు షెడ్యూల్ ఈ స్థానానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ ప్రచార పర్వాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా 2015 డిసెంబర్‌‌లో డాక్టర్‌‌ భూపతిరెడ్డి ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ రాలేదు. దీంతో కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ పొంది నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే.. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని టీఆర్‌‌ఎస్‌ నేతలు మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో భూపతిరెడ్డిని జనవరి 16, 2019న డిస్‌ క్వాలిఫై చేశారు. అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది.

అయితే.. ఉప ఎన్నికలో టీఆర్‌‌ఎస్‌ తరుఫున కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ నుంచి సుభాష్‌ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ నామినేషన్లు వేశారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. శ్రీనివాస్‌, భాస్కర్‌ నామినేషన్లను పరిశీలన సమయంలోనే అధికారులు తిరస్కరించారు. లోయపల్లి నర్సింగ్‌రావు, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు.

ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్‌ మెంబర్స్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. అంతా టీఆర్ఎస్ వారే ఉండడం కవిత ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమే.. సరిగా ఏడాదిన్నర తర్వాత కవిత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ కాబోతుండడం విశేషంగా మారింది.