Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ను లోపలికే రానివ్వలేదు!

By:  Tupaki Desk   |   10 July 2019 7:33 AM GMT
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ను లోపలికే రానివ్వలేదు!
X
అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు ముంబయిలోని రినైజాన్స్‌ హోటల్‌ వద్దకు వెళ్లిన మంత్రి డీకే శివకుమార్‌ కు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు అనుమతించలేదు. అయితే హోటల్‌ లో తాను రూమ్‌ బుక్‌ చేసుకున్నానని.. వెళ్లి వస్తానని మంత్రి డీకే చెప్పినా పోలీసులు వినలేదు. ఈక్రమంలో పోలీసులకు - డీకే శివకుమార్‌ కు మధ్య వాగ్వాదం కొనసాగింది. అనంతరం మంత్రి డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. తనకు మహారాష్ట్ర సీఎం మంచి స్నేహితుడన్నారు. అదేవిధంగా హోటల్‌లో ఉన్నవారు కూడా తనకు మిత్రులే అన్నారు. ఈక్రమంలో వారితో స్నేహపూర్వకంగా మాట్లాడేందుకే వచ్చాను. అయితే పోలీసులు అనుమతించక పోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు ప్రవేశం కల్పించి.. తనను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.

కర్ణాటక రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. ముంబయిలో అసంతృప్త ఎమ్మెల్యేల చుట్టూ కథ తిరుగుతోంది. ఇందులో భాగంగా కన్నడ రాజకీయాల్లో ట్రబుల్‌ షూటర్‌ గా పేరుగాంచిన మంత్రి డీకే శివకుమార్‌ బుధవారం ఉదయం ముంబయి తరలివెళ్లారు. ఆయనతో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్యేలు శివలింగేగౌడ - బాలకృష్ణ ప్రత్యేక విమానంలో వెళ్లారు. అయితే అక్కడే మకాం వేసిన కాంగ్రెస్‌ – జేడీఎస్‌ లోని అసంతృప్త ఎమ్మెల్యేలు మంత్రి డీకే శివకుమార్‌ నుంచి రక్షణ కల్పించాలని పోలీస్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తాము నివసిస్తున్న హోటల్‌ వద్ద భద్రత పెంచాలని కోరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ ఎమ్మెల్యేలు మకాం వేసిన హోటల్‌ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి డీకే శివకుమార్‌ ను హోటల్‌ లోకి అనుమతించరాదని ఎమ్మెల్యేలు కోరారు. అదేవిధంగా సీఎం కుమారస్వామి నుంచి కూడా తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పార్టీ నిబంధనలకు విరుద్ధంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై ఆరేళ్ల పాటు అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ ను కోరుతామని సీఎల్పీ నేత సిద్ధరామయ్య హెచ్చరించారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే పార్టీలో ఉండనిస్తామని.. లేని పక్షంలో సస్పెండ్‌ చేస్తామన్నారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. అయితే అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధరామయ్య హెచ్చరికలు పట్టించుకోలేదు. అంతేకాకుండా ముంబయి వెళ్లిన మంత్రి డీకే శివకుమార్‌ పై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు సీఎం కుమారస్వామి - మంత్రి డీకే శివకుమార్‌ నుంచి తమకు రక్షణ కావాలని కోరారు.

ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ నిర్ణయాన్ని మరో రెండు రోజులకు పొడిగించారు. అంతేకాకుండా రాజీనామా చేసిన వారిలో 8మంది పత్రాలను స్పీకర్‌ కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ తిరస్కరించారు. దీనికి తోడు ముగ్గురు రాజీనామాలపై ఈనెల 12న - మరో ఇద్దరి రాజీనామాలపై 15వ తేదీన విచారణ చేయనున్నట్లు స్పీకర్‌ వెల్లడించారు. అయితే సిద్ధరామయ్య సూచన మేరకే ఆయన రాజీనామాల ఆమోదంపై వాయిదా తీర్మానం పెట్టినట్లు సమాచారం. అంతలోపు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించి ముంబయి నుంచి కర్నాటక తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు.