Begin typing your search above and press return to search.

కన్నా కోడలు మృతి కేసు: ఫ్రెండ్స్ పార్టీలో ఏమైంది?

By:  Tupaki Desk   |   29 May 2020 6:00 AM GMT
కన్నా కోడలు మృతి కేసు: ఫ్రెండ్స్ పార్టీలో ఏమైంది?
X
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు నల్లపురెడ్డి సుహారిక రెడ్డి(32) అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆమె ఆకస్మిక మరణానికి కారణం ఏమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుహారిక ఆత్మహత్య చేసుకోలేదని.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అసలు నిజం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

సుహారిక, ఆమె భర్త ఫణీంద్రతో కలిసి గచ్చిబౌలిలోని హిల్ రిట్జ్ విల్లాస్ లో నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం తన స్నేహితుడు పవన్ రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ చిన్న పార్టీకి వీరు హాజరయ్యారు. ఫణీంద్రకు ఫ్యామిలీ ఫ్రెండ్ పవన్ రెడ్డి. ఈ పార్టీకి సుహారిక చెల్లులు భర్త కూడా హాజరయ్యారు. పార్టీ సందర్భంగా సుహారిక స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసినట్టు విచారణలో తేలింది. డ్యాన్స్ చేసిన కొద్దిసేపటికే ఆమె కుప్పకూలిపోయారు. ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు తెలపడంతో అందరూ షాక్ అయ్యారు.

లాక్ డౌన్ తర్వాత చాలా కాలానికి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. సుమారు 10-12 మంది ఈ పార్టీకి హాజరైనట్టు పోలీసుల విచారణలో తేలింది. గెట్ టు గెదర్ లాంటి ఈ పార్టీలో సుహారిక ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయారు. పార్టీలో గొడవ లాంటింది కూడా ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు.

విచారణ చేసిన రాయదుర్గం పోలీసులు ఇది హత్యగా నిర్ధారించలేమని తెలిపారు. ఇక ఆత్మహత్య కూడా కాదని తేల్చారు. సుహారికా మరణానికి ఖచ్చితమైన కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదిక అందిన తరువాతే తేలుతుందని చెప్పారు.